సీఎం రేవంత్ రెడ్డి : పారదర్శక విధానాలతోనే అభివృద్ధి సాగాలి
సీఎం రేవంత్రెడ్డి పారదర్శక విధానాలతో తెలంగాణ అభివృద్ధి, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాలు, కీలక ప్రాజెక్టుల ప్రగతి ప్రకటించారు.

పారదర్శకమైన విధానాలతోనే అభివృద్ధి సాగాలని..ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు నాకు అభ్యంతరం లేదని…పెట్టుబడుల విషయంలో రాష్ట్రానికి చెందిన వారికే మా మొదటి ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్స్లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇతర దేశాల ప్రతినిధులను ఇక్కడ పెట్టుబడులకు ఆహ్వానించే మేము.. ఇక్కడే ఉన్న మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం? అన్నారు. నేను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని అని..కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్న వాడిని కాదని స్పష్టం చేశార. సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తానని..అందుకే మీరు అడిగిన కొన్నింటికి నేను అంగీకరించకపోవచ్చని..ఎప్పటికీ మీకు నేను ఆ రకంగా సహకరించనని..పారదర్శక విధానంలో మాత్రమే ప్రజల కోణంలో మా సహకారం ఉంటుందన్నారు. ప్రభుత్వం పాలసీ, కన్స్ట్రక్షన్ రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివని..పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామన్నారు.
రాజకీయ నేతలు సృష్టించే అపోహలు నమ్మితే నష్టపోతారు
రాజకీయాల్లోనూ కాదు..వ్యాపార..వాణిజ్య రంగాలలోనూ ఒకే కుర్చీ కోసం 10 మంది పోటీ పడతారని..ఒకరు ఆ కుర్చీలో కుర్చున్నప్పుడు మిగిలిన 9 మంది నిరాశ చెందుతారని..ప్రత్యర్థులు సృష్టించే అపోహలకు లోనై వాటిని వ్యాపింపచేస్తే మన దేశానికి, రాష్ట్రానికి, మనందరికీ నష్టం అని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు మీరు ఊతం ఇస్తే నష్టపోయేది మీరేనన్నారు. అలాంటి అపోహలను తొలగించడానికే ఇక్కడికి వచ్చానని తెలిపారు. అపోహలు, అనుమానాలను దాటుకుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం..అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నాన్నారు. నాయకుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు, అపోహలకు తావిస్తుందని..పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం..పెట్టుబడులకు రక్షణ కల్పించడమేకాదు.. లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది.. మాది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మూడు భాగాలుగా తెలంగాణ అభివృద్ధి
తెలంగాణను మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని..కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయబోతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
జైపాల్ రెడ్డి గారి చొరవతో హైదరాబాద్ నగరానికి మెట్రో వచ్చిందని..పదేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదని..జరిగి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య కొంతైనా పరిష్కారమయ్యేదన్నారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మల్టీ యూనిట్ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలని..లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నానన్నారు. షామీర్ పెట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణకు కృషి చేస్తున్నామని..మన నగరం ప్రతిష్ట పెంచడానికే మా ప్రయత్నం అని స్పష్టం చేశారు. మాటిమాటికీ ఢిల్లీకి వెళుతున్నారని కొందరు మాట్లాడుతున్నారని..మెట్రో, మూసీ, ఇతర అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని..కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా ఎక్కడికి వెళతామని ప్రశ్నించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగళా ఇచ్చింది నెలకు నాలుగురోజులు వెళ్లి కేంద్రంతో అనుమతులు తెచ్చుకోవడానికేనని..దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నానన్నారు. అది ఫామ్ హౌస్ లా వాడుకుని దావత్ లు చేసుకునేందుకు కాదని పరోక్షంగా బీఆర్ఎస్ నాయకులకు చురకలేశారు. కేంద్రం వద్ధ 26 వేల కోట్లు రుణాలను 35 ఏళ్లకు 7.5 శాతం వడ్డీకి రీ స్ట్రక్చర్ చేయించామని..అలా 2 లక్షల కోట్ల రుణాలకు రీ స్ట్రక్చర్ కోసం ప్రధానిని కోరుతున్నామని వెల్లడించారు. ఇదినా ఒక్కడి కోసం చేస్తున్నది కాదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా తాపత్రయం అన్నారు.
మరిన్ని విమానాశ్రయాలు..డ్రై పోర్టు నిర్మాణాలు
మహారాష్ట్రలో 40విమానాశ్రయాలుంటే తెలంగాణకు మరిన్ని విమానాశ్రయాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని..మెట్రో, ఎయిర్ పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు 11 కొత్త రేడియల్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామని..వాటర్, రోడ్డు కనెక్టివిటీ లేకుండా ఇన్ఫ్రా స్రక్చర్ ఎలా అభివృద్ధి అవుతుందన్నారు. హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నామని..ఇందుకోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం.. త్వరలోనే అనుమతులు రాబోతున్నాయన్నారు.
భవిష్యత్తులో చెప్పుకునేలా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తా
నీళ్ళుండే చోటుకు మనం వెళితే నీళ్లు ఎక్కడికి వెళతాయని..అందుకే హైడ్రాతో చెరువులను పునరుద్ధరిస్తున్నామని..మూసీ ప్రక్షాళన చేపట్టామని..నాలాల ఆక్రమణలు తొలగిస్తే ఒక పెద్దమనిషి(బీఆర్ఎస్ నేత) సోషల్ మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం చేస్తున్నారని..దానికి మీరు మద్దతుగా నిలిస్తే మీకే నష్టం అని రేవంత్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణ కోసం ప్రణాళికలు మేం సిద్ధం చేస్తాం.. మీరు ప్రమోట్ చేయండని..ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. కులీ కుతుబ్ షా చార్మినార్ కట్టారు, ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ నిర్మించారు, హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని..వాళ్లు ఇక్కడ లేకపోయినా వారి పేర్లు చెప్పుకుంటున్నాం.. వారిని గుర్తు చేసుకుంటున్నాం అని..సంపాదించింది ఎవరైనా తీసుకెళతారేమో కానీ సమాజానికి ఇచ్చింది ఎవరూ తీసుకెళ్లలేరన్నారు. నాకు వేరే కోరికలేం లేవని..హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతానని..భవిష్యత్ లో వందేళ్లు, వెయ్యేళ్లు చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి, తపన ఉందని..నాకు వయసు ఉంది, ఓపిక ఉంది..అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని తెలిపారు. భూమి ఒక సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను మీరు ఎంత పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్తారనేదనిపైనే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆధారపడి ఉంటుందని సూచించారు.
ఇవి కూడా చదవండి…
ఇక మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్? – బిసిసిఐ మదిలో గిల్!
ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్! తండ్రీకొడుకులు, అల్లుడిపై పొంగులేటి గురి?