C.M. REVANTH REDDY | సెప్టెంబర్ 5,6తేదీల్లో హైదరాబాద్లో గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సదస్సు … లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్రెడ్డి
ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును ఈ ఏడాది సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నట్లు సీఎం ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు

విధాత, హైదరాబాద్ : ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును ఈ ఏడాది సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నట్లు సీఎం ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్లోబల్ అర్టిఫిషియల్ సదస్సు లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తో పాటు ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సదస్సును హైదరాబాద్ వేదికగా నిర్వహించనుండటం గర్వంగా ఉందన్నారు. సాంకేతిక ఆవిష్కరణలతో మన రాష్ట్రాన్ని మరింత ముందంజలో ఉంచేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కృత్రిమ మేథా రంగ నిపుణులు, ఐటీ ఆవిష్కర్తలెందరినో ఈ సందర్భంగా హైదరాబాద్కు ఆహ్వానిస్తు న్నామని చెప్పారు. ‘మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీ వన్..’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సదస్సును ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో.. ఎలా సాధికారత కల్పిస్తుందో అన్వేషించటమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుందని వెల్లడించారు. దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఈ సదస్సు ఏఐ పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, ప్రపంచంలో ఉన్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగా ఏఐ సామర్థ్యాలను అన్వేషించేందుకు ఈ సదస్సు కీలక వేదికగా ఉపయోగ పడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరిగే ఈ సదస్సు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ భవిష్యత్తుకు, కొత్త ప్రాజెక్టులకు నాంది పలుకనుందన్నారు. ఈ సదస్సుకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ను త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు.