నరేంద్ర మోదీ ప్రజలను నమ్మించి మోసం చేశారని, కరువు వస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు, మోదీ కర్ణాటకు ఖాళీ చెంబు తప్ప ఏమీ లేదన్నారు సీఎం రేవంత్రెడ్డి
విధాత: నరేంద్ర మోదీ ప్రజలను నమ్మించి మోసం చేశారని, కరువు వస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు, మోదీ కర్ణాటకు ఖాళీ చెంబు తప్ప ఏమీ లేదన్నారు సీఎం రేవంత్రెడ్డి. కర్ణాటక నుంచి 26ఎంపీలను ఇస్తే మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఒకటే కేబినెట్ పదవని విమర్శించారు. గుర్మిట్కల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా మల్లిఖార్జున ఖర్గే కొనసాగారన్నారు. 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడుగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ఐదు గ్యారంటీలను అమలు చేసిందన్నారు. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నామని చెప్పారు.
పదేళ్లలో మోదీ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని, 40కోట్ల ఖాతాలు తెరిపించిన ప్రధానీ మోదీ ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అలాంటి మోదీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేస్తే ఇక్కడున్న ముగ్గురు నాయకులు మీకు సేవ చేస్తారన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారు, రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయండన్నారు. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ ను గెలిపించండని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు.