ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం.. అంతే వేగంతో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసే ప్రక్రియ పూర్తి చేసింది. ఈ ఏడాది యాసంగి(రబీ)లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు కేవలం మూడు రోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేసింది
విధాత, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం.. అంతే వేగంతో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసే ప్రక్రియ పూర్తి చేసింది. ఈ ఏడాది యాసంగి(రబీ)లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు కేవలం మూడు రోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేసింది. మొత్తం 8,99,546 మంది రైతుల ఖాతాల్లో రూ.10547 కోట్లు జమ చేసిందని అధికారికంగా వెల్లడించింది. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్ర్రక్రియ పూర్తయినప్పటికీ రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించటంలో విఫలమైంది. ఈసారి రైతులు డబ్బులకు ఎదురుచూసే పరిస్థితి ఉండవద్దని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సివిల్ సప్లయిస్ విభాగం ధాన్యం అమ్మిన రైతులందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించి కొత్త రికార్డు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కూడా ముందుగా ప్రారంభించింది. ఏప్రిల్లో కాకుండా ఈసారి రెండు వారాలు ముందుగా మార్చి 25వ తేదీ నుంచే కొనుగోళ్లు ప్రారంభించింది. రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 7178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచింది. గత ఏడాది ఇదే సీజన్లో కేవలం 6889 సెంటర్లు నెలకొల్పింది. జూన్ 30వ తేదీ వరకు రబీ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసింది.
48లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు
రాష్ట్రమంతటా 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రబీ సీజన్లో కొనుగోలు చేసింది. ఈ ఏడాది 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని సివిల్ సప్లయిస్ విభాగం మొదట్లో అంచనా వేసింది. కానీ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ రేటు రావటం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మంచి ధరకు కొనుగోలు చేయటంతో కేంద్రాలకు వచ్చిన ధాన్యం అంచనా తగ్గిందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
ఈదురు గాలులు, అకాల వర్షాలకు కూడా రైతులు నష్టపోకుండా ఈసారి కొనుగోలు కేంద్రాల్లో సివిల్ సప్లయిస్ విభాగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసింది.
28వేల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ రికవరి
గతంలో ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం తిరిగి ఇవ్వకుండా బకాయి పడ్డ మిల్లర్లకు ఈసారి ప్రభుత్వం ధాన్యం కేటాయించలేదు. నూటికి నూరు శాతం కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించిన మిల్లర్లకు మాత్రమే ధాన్యం కేటాయించింది. రాష్ట్రంలో 1532 మంది మిల్లర్లు ధాన్యం ఇవ్వకుండా ఎగవేసిన జాబితాలో ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 116 మందిపై సివిల్ సప్లయిస్ విభాగం రెవిన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించింది. 2023 డిసెంబర్ నుంచి 2024 మే నెలాఖరు వరకు 28 వేల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ తిరిగి స్వాధీనం చేసుకుంది.