విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి పార్లమెంట్ ఎన్నికలు సవాల్ గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ఉవ్విర్లు ఊరుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచి ఏఐసీసీ అగ్రనేతల నుంచి మెప్పు పొందేందుకు ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల వైపు అందరి దృష్టి నిలుపుతున్నారు.ఇక్కడ ఉన్న రెండు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే రేవంత్ రెడ్డి కి మరింత రాజకీయ బలం చేకూరుతుంది.అదే దిశగా నేతలు ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాల్లో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కోరుకొంటోంది.ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి రాహుల్ గాంధీ కి బహుమతిగా ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభావం మెండుగా ఉంటోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం పరిధిలో రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లి ఉంది. దీంతో ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రభావం ఉండడం తో కాంగ్రెస్ పార్టీ కి కలిసివస్తుంది.
ఇది దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించి రేవంత్ రెడ్డి జిల్లా లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే సంకేతాలు ప్రజల్లో కి వెలతాయి.సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రెండు స్థానాల్లో గెలవాలని పార్టీ ఎమ్మెల్యే లకు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ లో జిల్లా ఎమ్మెల్యే లతో సీఎం సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి గా వంశీచంద్ రెడ్డి నియోజకవర్గం లో ఇప్పటికీ న్యాయయాత్ర పేరుతో ప్రచారం చేపట్టి ప్రజల తో మమేకమయ్యారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి కి టికెట్ కేటాయింపు లో జాప్యం జరగడంతో ప్రచారం ఇప్పుడిప్పుడే ప్రారంభించారు.
వంశీ కి పెరుగుతున్న మద్దతు:
మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న cwc సభ్యుడు చల్లా వంశీచంద్ రెడ్డి ప్రచారం లో దూసుకుపోతున్నారు.ఇదివరకే న్యాయ యాత్ర పేరుతో పార్లమెంట్ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే ఉండడం తో వంశీ గెలుపు ఖాయమనే ధీమా లో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్,నారాయణ పేట,కొడంగల్, జడ్చర్ల, షాద్ నగర్ నియోజకవర్గాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి.గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన వంశీ చంద్ రెడ్డి మూడో స్థానం తో సరిపెట్టుకున్నారు.
ఆ ఎన్నికల్లో ఆయనకు 193631 ఓట్లు వచ్చాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో పెద్దగా బలం లేక పోవడంతో పెద్ద గా ఓట్లు పడలేదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అయ్యాయి.గత పార్లమెంట్ ఎన్నికలకు భిన్నంగా ఈ నియోజకవర్గాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ విజయం నల్లేరు పై నడక అనే విధంగా ఉందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
నాగర్ కర్నూల్ లో పట్టు కోసం మల్లు రవి ప్రయత్నం :
నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిపేందుకు కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన పడింది. చివరకు పార్టీ సీనియర్ నేత మల్లు రవి వైపు ఏఐసీసీ పెద్దలు చూపునిలిపి ఆలస్యం గా టికెట్ కేటాయించారు.పీసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ టికెట్ కోసం పోటీ పడడంతో మల్లు రవికి టికెట్ రావడం ఆలస్యం అయింది. దీంతో మల్లు రవి ప్రచారం లో కాస్త వెనుక పడినా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన కోసం ముందునుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేసిన మల్లు రవికి 309924 ఓట్లు వచ్చి రెండో స్థానంలో నిలిచారు.ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా అందులో ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు.
నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కి ఎమ్మెల్యే లు ఉన్నారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో బీ ఆర్ ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క అలంపూర్ నియోజకవర్గం లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కి కొంత నిరాశ ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితి కనిపిస్తోంది. మల్లు రవి కి జిల్లా ఎమ్మెల్యే లె కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మద్దతు మెండుగా ఉంది. దీంతో ఆయన గెలుపు సునాయాసంగా ఉంటుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్కే అనుకూలం
2019 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో మూడో స్థానంలో నిలబడింది. నాగర్ కర్నూల్ సెగ్మెంట్ లో రెండో స్థానం తో సరిపెట్టుకుంది. 2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కి రోజు రోజుకు బలం పెంచుకుంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుని గా భాద్యతలు చేపట్టిన తరువాత జిల్లా లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తి గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ఏకంగా ఉమ్మడి జిల్లా లో 14 అసెంబ్లీ స్థానాలకు 12 స్థానాల్లో విజయం సాధించింది.ప్రస్తుతం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండు స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా లో ఆ పార్టీ నేతలు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి తన సత్తా చాటుకోవాలనే పట్టుదల తో ఉన్నారు.