చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం.. రాష్ట్రాన్ని దోచుకుని మాపై నిందలా?
డబుల్ ఇండ్లు కట్టిన ఊర్లలో మీరు ఓట్లడగండి
ఇందిరమ్మ ఇండ్లున్న ఊర్లలో మేం అడుగుతాం
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేసిన బీఆరెస్
ఇదే తుక్కుగూడ నుంచి బీఆరెస్ను తరిమికొట్టాం
ఇక్కడి నుంచే దేశంలోని బీజేపీని తరమాలి
నమో అంటే.. నమ్మితే మోసం
మా పాలన బాగుంటే 14 సీట్లలో గెలిపించండి
తుక్కుగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ నుంచి మొదలై బీఆరెస్ అవినీతి, నియంతృత్వ పాలనను తరిమికొట్టినట్లుగానే, ఇక్కడి నుంచే దేశంలోని బీజేపీని తరిమికొట్టాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేసుకున్న స్ఫూర్తితో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను ప్రజలకు ఇస్తున్నదని చెప్పారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ఐదు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. దేశంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి పదేళ్లలో 20కోట్ల ఉద్యోగాలివ్వాల్సి ఉండగా, పార్లమెంటులో 7లక్షల 21వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్లుగా చెప్పి్దన్నారు. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలన్నారు. మద్దతు ధర అడిగిన రైతులను ఢిల్లీ సరిహద్దుల్లో 750మందిని పొట్టనపెట్టుకున్న మోదీ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలన్నారు. ప్రజలు, ప్రాంతాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, విభజన రాజకీయాలతో అధికారం కాపాడుకుంటున్న మోదీ ప్రభుత్వం ఈ దఫా ఉత్తర, దక్షిణ భారత దేశ ప్రజల మధ్య చీలికలు, మత విద్వేషాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నదని హెచ్చరించారు. నమో అంటే నమ్మితే మోసమని అభివర్ణించారు. హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగాణ విభజన చట్టం హామీలను అమలు చేయకుండా, ఏడు మండలాలను ఏపీలో కలిపిన మోదీ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ను బొంద పెట్టినట్లుగానే పార్లమెంటు ఎన్నికలోవ్ల బీజేపీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రంగా విరుచుకుపడిన రేవంత్రెడ్డి.. ఆ మధ్యలో కుక్కలు మొరిగితే.. నిన్న మొన్న ఒక నక్క సూర్యాపేట, కరీంనగర్లకు వెళ్లి తమను అభ్యంతరకర భాషలో తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాష, భావం, ప్రజాసమస్యల గూర్చి మాట్లాడిన మాజీ సీఎం వెంట్రుక కూడా పీకలేడని అంటున్నారని చెప్పారు. తెలంగాణను పదేళ్లుగా దోపిడి దొంగల్లా దోచుకుని, అడవి పందుల్లాగా పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేసి ఇప్పుడు వెంటుక కూడా పీకలేవంటున్నాడన్న రేవంత్రెడ్డి.. తమ కార్యకర్తలు తలుచుకుంటూ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదని హెచ్చరించారు. ఏదో కాలు విరిగిందని, అధికారం పోయిందన్న బాధ, కూతురు జైలుకు పోయిందన్న బాధలో ఉన్నారని కాస్త ఓపిక పట్టామని చెప్పారు. ‘నువ్వు తిడితే పడటానికి నేను జానారెడ్డి అంత ఓపిక ఉన్నోడిని కాదు.. నేను రేవంత్రెడ్డిని. నీ అంగీలాగు ఉడబెరికి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా’ అంటూ ఘాటుగా హెచ్చరించారు. పేదలకు నీవు కట్టిస్తానన్న డబుల్ బెడ్ రూమ్లు ఇళ్లు కట్టించకపోయినా తాను మాత్రం కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు ఉండే విధంగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్నారు. రాష్ట్రంలోని పేదలకు 22 వేల 500 కోట్లతో 4 లక్షల 50వేల ఇండ్లను నిర్మించుకోబోతున్నామన్నారు. ‘కేసీఆర్కు సవాల్ విసరుతున్నా.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన ఊర్లలో నీవు ఓట్లు అడుగు.. ఇందిరమ్మ ఇండ్లు కట్టిన ఊర్లో మేం ఓట్లు అడుగుతాం’ అని చెప్పారు. బీఆరెస్కు ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని స్పష్టం చేశారు.
మా పాలన బాగుంటే లోక్సభ ఎన్నికల్లో గెలిపించండి
తాము వంద రోజుల్లో మంచి పాలన చేశామని ప్రజలు భావిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తమను పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని రేవంత్రెడ్డి కోరారు. తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే కాంగ్రెస్కు రాష్ట్రంలో 14 సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాలుగువేల కిలోమీటర్లు రాహుల్గాంధీ పాదయాత్ర చేసి దేశంలోని పేదలు, బడుగులకు అండగా నిలబడ్డారని చెప్పారు. అలాంటి నాయకుడు దేశానికి ప్రధానిగా ఉండాలని ఆకాంక్షించారు. హెలికాప్టర్లలో, విమానాల్లో తిరుగుతూ గంట గంటకూ డ్రెస్లు మార్చే మోదీ ప్రధానిగా ఉండరాదని స్పష్టంచేశారు. ఈ లోక్సభ ఎన్నికలు మోదీ పరివార్కు, గాంధీ పరివార్కు మధ్య జరుగుతున్నాయని రేవంత్రెడ్డి అభివర్ణించారు. మోదీ పరివార్ అంటే ఈడీ, ఐటీ, సీబీఐ, ఈవీఎంలు అని, గాంధీ పరివార్ అంటే త్యాగాల కుటుంబం సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ కార్యకర్తలు అని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు గాంధీ పరివార్ను గెలిపించాలన్నారు. ఇక్కడకు వచ్చిన ప్రజలను చూస్తోంటే ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి, దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది ఒకేసారి పోటెత్తినట్లుందని చెప్పారు. మీ శ్రమ, మీ కష్టం, మీ త్యాగంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్న రేవంత్రెడ్డి.. తెలంగాణ స్ఫూర్తితో కేంద్రంలోనూ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి, డీ శ్రీధరాబాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క ప్రభృతులు ప్రసంగించారు.