దేశంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద ఫాసిస్టు బిజెపి, దాని మిత్ర పక్షాలను ఓడించి,ప్రజాస్వామిక, లౌకిక, ప్రజాతంత్ర హక్కుల కోసం పోరాడుదామని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు
ప్రజాస్వామిక, లౌకిక, ప్రజాతంత్ర హక్కుల కోసం నిలబడదాం
సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నేత రాయల చంద్రశేఖర్
విధాత, వరంగల్ ప్రతినిధి: దేశంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద ఫాసిస్టు బిజెపి, దాని మిత్ర పక్షాలను ఓడించి,ప్రజాస్వామిక, లౌకిక, ప్రజాతంత్ర హక్కుల కోసం పోరాడుదామని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండలో సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా ఎన్నికల జనరల్ బాడీ సమావేశం జిల్లా కార్యదర్శి చిర్ర సూరి అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా దేశ ప్రజలను నిలువు దోపిడీ చేసిందన్నారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారు చౌకగా అమ్మేసిందన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నా కులగణన చేపట్టలేదన్నారు. నిత్యావసర వస్తువులు ధరలన్నీ రెట్టింపు చేశాడన్నారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తానని, అవినీతిని రూపుమాపుతామని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు తెస్తామని హామీలిచ్చిన నరేంద్ర మోడీ, ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.
అత్యాచారయత్నాలకు పాల్పడిన వారికి, బాల్కినో భాను కేసులో శిక్ష అనుభవించిన రేపిస్టులకు, హంతకులకు అండగా నిలబడటం చాలా దుర్మార్గమని, వాటి గురించి మాట్లాడకుండా బీజేపీ చట్టబద్ధంగా అవినీతిని ప్రోత్సహిస్తూ, ఎలక్ట్రోరల్ బాండ్ల పేరుతో వేలకోట్ల ముడుపులను సమకూర్చుకున్నదని ఆరోపించారు. బీజేపీ, ఆరెస్సెస్ శక్తులు మళ్లీ మూడవసారి ఎన్నికల్లో గెలిస్తే దేశంలో ఇక కనీస ప్రజాస్వామ్యం, హక్కులు లేకుండా పోతాయన్నారు. మతాల ఎజెండా చుట్టే పరిపాలనసాగి, ప్రజల అవసరాలు కనుమరుగు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల పాలనలో మోడీ దేశ అభివృద్ధికి చేసింది శూన్యమని, బిజెపి పార్టీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దేవుడు ,మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నదని మాటలకు మోసపోకుండా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ చంద్రన్న, గడ్డం సదానందంలు మాట్లాడుతూ ఇప్పటికే నరేంద్ర మోడీ దేశభక్తి, మత భక్తి ముసుగులో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం అవుతుంటే దళిత, గిరిజన, బడుగు, బలహీన ముస్లిం పేదవర్గాలకు రిజర్వేషన్లు, ఉద్యోగాలు ఏ రంగంలో కల్పిస్తారని ప్రశ్నించారు. కాశ్మీర్లో ఉన్న విలువైన భూములను కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకే ఆర్టికల్ 370 ని రద్దు చేశాడు తప్ప దేశం పట్ల ప్రేమతో కాదనే విషయాన్ని విద్యార్థి, యువత, దేశ ప్రజలు గ్రహించాలని కోరారు.
దేశ లౌకిక వ్యవస్థకు, ప్రజల ప్రజాస్వామిక హక్కులకు, భిన్నత్వంలో ఏకత్వానికి మోడీ ప్రభుత్వం ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ప్రశ్నించిన వాళ్లను కమ్యూనిస్టులుగా, అర్బన్ నక్సల్స్ గా చిత్రీకరిస్తూ నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, భౌతిక దాడులకు తెగబడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు.
ఈ కార్యక్రమంలో CPI(ML)మాస్ లైన్ వరంగల్ డివిజన్ కార్యదర్శి బొట్ల రాకేష్, జిల్లా నాయకులు అర్షం అశోక్ , అడ్డూరి రాజు, మైదం పాణి , నర్సన్న, పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు కత్తుల కొమురయ్య, ధార లింగన్న, మలబోతుల మల్లన్న, భద్రాచారి, కె.రవి, బాలరాజు, స్వామి, ఉష్మా రమేష్, సింగం కిషన్ తదితరులు పాల్గొన్నారు.