New Year | హైదరాబాద్ : న్యూఇయర్ సమీపిస్తున్న వేళ.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మద్యం ప్రియులను, బార్లు, పబ్లను యజమానులను కూడా పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.
తాజాగా వాహనదారులను కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. న్యూఇయర్ వేళ ప్రతి వాహనదారుడు జాగ్రత్తగా తమ వెహికల్ను డ్రైవ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆటో, క్యాబ్ డ్రైవర్లతో పాటు సొంత వాహనదారులు కూడా డిసెంబర్ 31న అన్ని ధ్రువపత్రాలతో బయటకు రావాలని పోలీసులు సూచించారు. పోలీసుల తనిఖీలకు సహకరించాలని కోరారు. పోలీసులు అడిగిన పత్రాలను చూపించని యెడల చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు జారీ చేస్తామన్నారు.
రాంగ్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, అతి వేగం, సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే వారిని అదుపులోకి తీసుకుని, చట్టం ప్రకారం శిక్షిస్తామన్నారు. ప్రత్యేక ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తిస్తామన్నారు. సైబరాబాద్ పరిధిలోని ప్రతి రోడ్డులో కూడా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ తనిఖీలు డిసెంబర్ 31న రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం అవుతాయన్నారు.
