Deputy CM Bhatti | సుంకిశాలపై విచారణ జరిపిస్తాం.. కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్‌

సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్ చేశారు

Deputy CM Bhatti | సుంకిశాలపై విచారణ జరిపిస్తాం.. కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్‌

విధాత, హైదరాబాద్ : సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్ చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుంకిశాలకు సంబంధించిన ఘటనలో పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం సరికాదని భట్టి అన్నారు. సుంకిశాల ఘటనతో కృష్ణా నదిపై బీఆరెస్‌ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేయిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం, సుంకిశాల ప్రాజెక్టులను నిర్మించారని.. నీళ్లు రాకుండానే కాళేశ్వరం కుంగిపోయిందని పేర్కొన్నారు. నీళ్లు వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టు మునిగిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు అక్కడ కట్టడం సరికాదని కాంగ్రెస్ ముందే చెప్పిన వినకుండా.. బీఆరెస్‌ ప్రభుత్వం నిర్మించిందని, ఫలితం ఏంటో ఇప్పుడు అందరం చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు వద్దనుకున్న సుంకిశాలను బీఆరెస్ తెరపైకి తెచ్చిందన్నారు. ఇంజనీర్లు చెప్పింది కాదని.. కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకొని కాళేశ్వరం కట్టడం వల్లే కుంగుబాటుకు కారణమైందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇంజనీర్లు చేయాల్సిన పని ఇంజనీర్లు చేయాలని కానీ, ఇంజనీర్లు చేయాల్సిన పనిని కేసీఆర్ చేయడం వలనే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు.

బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టు నాణ్యత లోపాల అవినీతిని ఎప్పుడు బయటపెట్టాలని చూస్తున్న తమకు సుంకిశాల ఘటనను దాచి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులకు రీ డిజైన్ చేసి ఇరిగేషన్ శాఖను బీఆరెస్‌ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని తెలిపారు. రూ.1450 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చి.. రూ.23 వేల కోట్లకు అంచనాలు పెంచి రాష్ట్ర ఖజానాను బీఆరెస్‌ ప్రభుత్వం దోపిడీ చేసిందని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరానికి కూడా బీఆరెస్‌ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని భట్టి విమర్శించారు.