రేవంత్ మళ్ళీ కొత్త అవతారం ఎత్తి, 17 సీట్లు గెలిపించండి అన్నీ అమలు చేస్తా అంటున్నాడని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.
మోకాలికి బోడగుండుకు ముడి పెట్టి మాట్లాడుతున్న రేవంత్
మేడ్చల్ లో ప్రజాబలం లేని కాంగ్రెస్
విధాత: రేవంత్ మళ్ళీ కొత్త అవతారం ఎత్తి, 17 సీట్లు గెలిపించండి అన్నీ అమలు చేస్తా అంటున్నాడని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించన ఆయన మనం తెలంగాణలో గెలిపిస్తే 40 సీట్లున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అని అడిగారు. రేవంత్ రెడ్డి మోకాలికి బోడగుండుకు ముడి పెట్టి మాట్లాడుతున్నారని, ఎంపీ ఎన్నికలకు రేవంత్ ఇచ్చిన హామీలకు ఏమన్నా సంబంధం ఉందా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే దాని విలువ జీరో అని అన్నారు. కాంగ్రెస్ గెలవడం కోసం అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇచ్చారా? అని అడిగారు. లక్షరూపాయలతో పాటు కళ్యాణలక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడని, రైతుకు 15,000 ఇచ్చారా? అని అన్నారు. కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చెయ్యలేక పోయారని, మరి రేవంత్ 2 లక్షల రుణమాఫీ కోసం 34 వేల కోట్లు ఒకే సంవత్సరంలో ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. జీరో కరెంటు బిల్లు హామీ అమలయ్యిందా? అని అడిగారు.
35 సంవత్సరాలుగా నేను ఇక్కడ స్థానికున్ని, నేను ఎలా ఎదిగానో ఇక్కడున్నవాళ్లందరికీ తెలుసని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ నాయకులను చేర్చుకుంటే ఎలా చేర్చుకుంటారు అని కొట్లాడిన కాంగ్రెస్ , ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే పని చేస్తుందని విమర్శించారు. మేడ్చల్ లో కాంగ్రెస్ కి ప్రజాబలం లేదు, ప్రజాదరణ లేదన్నారు. దింపుడు కల్లం ఆశతో ఒక్కో నాయకున్ని లక్ష నుండి 5 కోట్ల రూపాయలు వెలకట్టి కొనుక్కుంటున్న పరిస్థితి ఉందని, ఒక వైపు ప్రజాస్వామ్యం బ్రతికించడం కోసం బీజేపీలో చేరుతున్న వారు మరో వైపు ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరిన మాజీ ఎంపీపీ చంద్ర శేఖర్, ఈశ్వర్ గౌడ్, పరమేష్ యాదవ్, మహేష్ యాదవ్, పవన్ యాదవ్, రామచందర్, వినయ్ జెన్, పవన్, సూరి, కస్తూరి నాగులు, యోగి తదితరులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.