కాంగ్రెస్ హామీలన్ని అమలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తా : ఈటల సవాల్‌

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ చేశారు.

విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ చేశారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ మాటలు తప్ప హామీల అమలు లేదన్నారు.

డిక్లరేషన్‌ల పేరుతో ఎన్నికల సమయంలో హడావుడి చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు హామీల అమలును గాలికి వదిలేసిందని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. ఆరు నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని నిలదీశారు. కేసీఆర్ జుట్ల నుంచి వచ్చినట్లుగా కాంగ్రెస్ పాలన సాగుతుందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

నోటుతో ఓటును కొనాలని చూసేవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న పార్టీలకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గుణపాఠం నేర్పించాలని కోరారు. దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పాలనలో జరిగిన ప్రగతిని గమనించి పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని అభ్యర్థించారు.