భూమిని సాగు చేసి, పంటలు పండించే రైతులకే భరోసా అమలు చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు ప్రభుత్వానికి విజప్తి చేశారు. బుధవారం ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతు భరోసాపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించారు.
సాగు చేసేవారికే
రైతు భరోసా
10 నుంచి 20 ఎకరాల వరకు పరిమితి పెట్టాలి
పన్ను కట్టేవారు, ఉద్యోగులను మినహాయించాలి
బంజర్లు, వెంచర్లకు కూడా వెళ్లకుండా చూడాలి
ఏజెన్సీలో పట్టాలేని రైతులకు, కౌలు రైతులకు ఇవ్వాలి
2011 కౌలు చట్టం అమలు చేయండి
ఎరువులు, విత్తనాలు పంపిణీ పునరుద్ధరించాలి
రైతు భరోసా ఒక్కటే సర్వరోగ నివారిణి కాదు
ఖమ్మంలో అభిప్రాయ సేకరణలో రైతులు
విధాత: భూమిని సాగు చేసి, పంటలు పండించే రైతులకే భరోసా అమలు చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు ప్రభుత్వానికి విజప్తి చేశారు. బుధవారం ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతు భరోసాపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించారు. తమ అభిప్రాయాలు చెప్పడానికి రైతులు, రైతుసంఘల నాయకులు, కౌలు రైతులు, డాక్టర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు మాట్లాడుతూ పంట పండించే రైతుకే సహకారం అందించాలని స్పష్టంచేశారు. అయితే గత ప్రభుత్వం కౌలు రైతులను విస్మరించిందని, దీంతో కౌలు రైతు గుర్తింపుకు నోచుకోలేదని వివరించారు. ఈ మేరకు 2011 నాటి కౌలు చట్టం అమలు చేయాలని, వాస్తవంగా భూమిని సాగు చేస్తున్న కౌలు రైతుకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు సబ్సిడీపై లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు రైతు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
వారికి వద్దు
ప్రభుత్వానికి పన్నులు చెల్లించే ఆదాయ వర్గాల ప్రజలు, భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు భూములు సాగు చేస్తున్నా వారికి రైతు భరోసా ఇవ్వవద్దని పలువురు తేల్చి చెప్పారు. అలాగే రైతు భరోసా నుంచి బంజరు భూములు, బీడు భూములను మినహాయించాలని కోరారు. ఆదాయ పన్నులు చెల్లించే వర్గాల వారికి రైతు బంధు అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఇందు కోసం నిజమైన రైతులు ఎవరో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి జాబితా రూపొందించాలన్నారు.
ఆదివాసీ రైతులకూ భరోసా ఇవ్వాలి
భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులకు రైతు భరోసా అమలు చేయాలని ఖమ్మం ప్రజానీకం ప్రభుత్వాన్ని కోరింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు పట్టాలు పొందిన, పోడు పట్టాలు పొందకుండా అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతులకు కూడా రైతు భరోసా వర్తింప చేయాలన్నారు. ముఖ్యంగా దాదాపు 50 ఏళ్లకు పైగా అనేక మంది గిరిజనేత రైతులు ఏజెన్సీ ఏరియాల్లో భూములు కొనుక్కొని సాగు చేసుకుంటున్నారని, వారికి నేటికి కూడా ఎలాంటి పట్టాలు లేవని, అలాంటి రైతులకు భరోసా సహాయం అందించాలని రైతులు కోరారు. ఇదే సమయంలో ప్రభుత్వాలు రైతుల సమస్యలన్నింటికీ ఒక్క రైతు భరోసానే సర్వరోగ నివారిణి కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అన్నింటికీ రైతు బంధే సర్వరోగ నివారిణి అన్న తీరుగా గత ప్రభుత్వం అనుసరించిందని, అలా కాకుండా ఇది వరకటి ప్రభుత్వాలు అమలు చేసిన విధంగా విత్తనాల సబ్సిడీ, బిందు సేద్యానికి సబ్సిడీతో పాటు పంటల బీమా పథకాన్ని త్వరిత గతిన అమలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ప్రస్తుతం రైతులకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదన్న వారు, ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన విధంగా సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలన్నారు.
బీఆరెస్ ప్రభుత్వం ఎలాంటి సీలింగ్ లేకుండా రైతు బంధు అమలు చేసిందని, అలా కాకుండా రైతు బంధు 10 ఎకరాల వరకా? 20 ఎకరాల వరకా? అన్నదానిని గుర్తించి సీలింగ్ విధించాలని ఖమ్మం జిల్లా వాసులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల రైతులు, మేధావుల సలహాలు తీసుకొని రైతు భరోసా అమలుకు సీలింగ్ నిర్ణయించాలని మంత్రులకు సూచించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభంలోనే తొలకరి సాగుకు విత్తనాలు, ఎరువులను రైతులు కొనుగోలు చేస్తారని, అలాంటి రైతులు పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని, ఈ మేరకు తొలకరి సాగుకు ముందే రైతు భరోసా నిధులు రైతులకు అందిస్తే మంచిదని తెలిపారు. పాత పాస్ పుస్తకాలలో ఉన్న పట్టా భూములు కూడా ధరణి నమోదు కాలేదని, దీంతో అనేక మంది సామాన్య రైతులు తాము సాగు చేసుకుంటున్న ఎకరా, రెండెకరాల భూములకు రైతు బరోసా సహాయం అందుకోలేక పోతున్నారని తెలిపారు. ఈ మేరకు రైతుల భూమున్నింటిని ధరణిలో ఎక్కించి, ఆయా భూములకు రైతు భరోసా అందించే విధంగా రైతు సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.