ఫిరాయింపులపై మాట్లాడే నైతికత బీఆరెస్కు లేదు: షబ్బీర్ అలీ
పార్టీ ఫిరాయింపుపై ప్రశ్నించే నైతికార్హత బీఆరెస్కు లేదని, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు ఆధ్యుడు కేసీఆర్ కాదా అని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఘాటుగా విమర్శించారు.

నాడు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లాక్కున్న వైనం మరువరాదు
మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
విధాత, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుపై ప్రశ్నించే నైతికార్హత బీఆరెస్కు లేదని, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు ఆధ్యుడు కేసీఆర్ కాదా అని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఘాటుగా విమర్శించారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరేనని, అందుకు నడి బజార్ లో నిలబెట్టి ఆయనను శిక్షించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతుంటే ఆ పార్టీ నేతలకు బాధ అవుతుందని, మరీ గతంలో మా పార్టీ ఎమ్మెల్యేలను లాకొన్నప్పుడు ఈ బాధ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని భట్టి విక్రమార్కకు అప్పట్లో ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మండలిలో ఎమ్మెల్సీలను కూడా కేసీఆర్ లాక్కున్నారని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. బీఆరెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో డిపాజిట్ పోయిందని, ఇప్పుడు అనర్హత వేటు గురించి మట్లాడుతున్నారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు.
ఇవ్వాళ కుటుంబ, నియంతృత్వ పార్టీగా మారిన బీఆరెస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు బయటపడుతు ప్రజాస్వామిక పార్టీలో చేరుతున్నారన్నారు. సింగరేణిపై బీజేపీ, బీఆరెస్లు డ్రామాలు అడుతున్నాయని విమర్శించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో సింగరేణిలో కార్మికుల సంఖ్య 71 వేలు ఉండేదని.. ఇప్పుడు 21 వేలకు పడిపోయిందన్నారు. పదేళ్లలో బీజేపీ, బీఆరెస్ సింగరేణిని నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణని కేసీఆర్ అంగడి బజారులో పెట్టారని, తెలంగాణని అమ్మకానికి పెట్టారంటూ కేసీఆర్పై షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆరెస్ పార్టీ ఖతం అయ్యిందని, 11 ఎకరాలు బీఆరెస్ పార్టీ కార్యాలయం కోసం ఎందుకు?.. ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు ఆఫీస్ లేదని, కోకపేటలో బీఆరెస్ పార్టీకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుని ఆ భూమి వేలం వేసి ఆ డబ్బులు రుణమాఫీకి ఉపయోగించాలని ప్రభుత్వానికి సూచించారు. బీఆరెస్ పార్టీకి ఇప్పుడున్న ఆఫీస్ ఎక్కువని.. దానికి కూడా తామే భూమి ఇచ్చామని గుర్తు చేశారు.