విధాత : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10:30నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 10 గంటల వరకే అనుమతిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించిన క్రమంలో అభ్యర్థులను ముందుగానే సెంటర్లకు చేరుకున్నారు. సెంటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో అభ్యర్థిని చెక్ చేసిన అనంతరమే సిబ్బంది ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సెంటర్ల వద్ద కొంత మంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో నిరాశతో వెనుదిరిగారు.
సిద్దిపేట డిగ్రీ కళాశాల, కరీంనగర్ ఉమెన్స్ కళాశాల, గోదావరి ఖని బాలికల జూనియర్ కళాశాల సహా పలు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్న విద్యార్థులను నిమిషం నిబంధన నేపథ్యంలో పరీక్షకు అనుమతించలేదు. దీంతో సదరు అభ్యర్థులు కొంత సేపు అధికారులను బతిమిలాడుకుని చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టులను గ్రూప్-1 ద్వారా టీజీపీఎస్సీ భర్తీ చేస్తోంది. ఈ పరీక్ష కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 897 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం చేసింది.