అకాల వర్షాలతో నష్టపోయి పంట నేల పాలు కాగా, చేతికందిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు
ధైర్యం కోల్పోతున్న రైతన్నలు
ధాన్యం కొనుగోల్లలో జాప్యం
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కరువు
టార్పాలిన్లు…గోనె సంచుల సమస్య
ధాన్యం కొనుగోల్లలో వేగంపెంచాలి
విధాత ప్రత్యేక ప్రతినిధి: అకాల వర్షాలతో నష్టపోయి పంట నేల పాలు కాగా, చేతికందిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వర్షం బారినుంచి రక్షించుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. ఇప్పటికే రెండు మూడు రోజులుగా వర్షాలు కురిసి ఇబ్బందులు పడుతుండగా మరో ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరిక మరింత ఆందోళనకరంగా మారింది.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో రకరకాల సాకులు చెప్పి రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం, తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడతే రైతుల్లో కొంత ఆందోళన తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
రైతుల సహనానికి సర్కారు పరీక్ష
ఒకవైపు ప్రకృతి పగబట్టగా, మరోవైపు ప్రభుత్వం రైతన్నల సహనాన్ని పరీక్షిస్తోంది. సరైన వసతులు లేని కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ధైన్య స్థితిలో ఉన్న రైతన్న ధైర్యం కోల్పోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, అధికారులు ప్రకటనలు చేయడం తప్ప ధాన్యం కొనుగోలులో వేగం ప్రదర్శించడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే తడిసి ముద్దయిన ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు సైతం స్థలం లేక, వరుస వర్షంతో రైతులు తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం తేమ శాతం పేరుతో కొనుగోళ్లు జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర మంత్రులంతా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం మాత్రం చేసిన సందర్భం కనిపించడంలేదు.
మరోవైపు జిల్లా కలెక్టర్లు నిన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల్లో బీజీగా ఉన్నారు. పేరుకు మాత్రమే కొందరు కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రైతు సంఘాల ప్రతినిధులు కేంద్రాల్లో కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శనివారం రాష్ట్ర కేబినేట్ మీటింగ్ ఉన్నందున రైతుల సమస్య ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆరెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తోందీ.
ధాన్యం కొనుగోల్లలో జాప్యం
ప్రభుత్వం ప్రచార ఆర్భాటంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి కొంటున్నట్లు అధికార యంత్రాంగం చెబుతున్నారని కానీ ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధంగా రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేవని రైతు సంఘాల నాయకులు విమర్శించారు. కేంద్రాలు ఏర్పాటు చేసి రోజులు దాటినా ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. ధాన్యం కొనుగోలు చేయలేదని, కనీసం రైతులకు కావాల్సిన పరదాలు, టార్పాలిన్ లు సైతం ఇవ్వలేదని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నదన్నారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని ఆరబెట్టినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో టోకెన్స్, గోనె సంచులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సెంటర్లలో ఉండాల్సిన సిబ్బంది సైతం అందుబాటులో లేరని ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం భయాందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా దాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించి రైతులకు టోకెన్లు అందించి, గోనె సంచులను సరఫరా చేసి, సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.