ఇంజనీరింగ్ కాలేజీలకు సర్కార్ సహాయం,ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల సదస్సులో … సీఎం రేవంత్రెడ్డి
ఇంజనీరింగ్ కళాశాలలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశ భవిష్యత్తును నిర్మించేలా ఉండాలని, అందుకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు

బకాయిలు లేకుండా ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లింపు
యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల భర్తీ
త్వరలోనే జాబ్ క్యాలెండర్..స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు
విధాత, హైదరాబాద్ : ఇంజనీరింగ్ కళాశాలలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశ భవిష్యత్తును నిర్మించేలా ఉండాలని, అందుకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కళాశాలలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదన్నారు. కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా దేశానికి మేధావులను అందించే సంస్థలుగా ఉండాలన్నారు. ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సార్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ నిర్ణయం తీసుకుందన్నారు. రకరకాల పరిస్థితులలో ప్రాధాన్యతలు మారి.. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఈ అకాడామిక్ ఇయర్ నుంచి ఆన్ టైమ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించేందుకు ప్రయత్నిస్తామన్నారు. పాత బకాయిలపై ఎలా ముందుకెళ్లాలనే అంశాన్ని పరిష్కరించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలను వివరించాలనే ఈ కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై త్రిముఖ వ్యూహంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు.
శనివారం జేఎన్టీయూలోని జేఎన్ ఆడిటోరియంలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబుతో కలిసి సదస్సును జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్-2024 లోగోను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు.
ఉపాధి శిక్షణకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ
దేశంలో, ప్రపంచంలో గొప్ప నిర్మాణాలన్నీ ఇంజనీర్లు సృషించినవేనన్నారు. మానవనిర్మిత అద్భుతాలన్నీ ఇంజనీర్లు ఆవిష్కరించినవేనని గుర్తు చేశారు. ఇంజనీరింగ్ లో కేవలం కంప్యూటర్ సైన్స్ పైనే కాదు… సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. దేశ అవసరాల మేరకు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆయా కోర్సుల నిర్వాహణకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా టాటా భాగస్వామ్యంతో రూ.2400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలు మారుస్తోందని, ఫార్మా, ఐటీ తరువాత ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. యువత కోసం త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఏఐ రిలేటెడ్ కోర్సులు ప్రవేశపెడితే ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ నిర్మాణం
పక్క రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు… నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ముందుకెళుతోందన్నారు. పదేళ్లు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కొట్లాడిందని, కానీ ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను తీసుకురాబోతున్నామని, యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే మా ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. మేం అధికారంలోకి వచ్చిన మొదటి 30రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఆర్ధిక భారం, ఇతర సమస్యలు ఉన్నా… ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.