Ganesh Idol Immersion : హైదరాబాద్లో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం
హైదరాబాద్లో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం. 50 వేల విగ్రహాలు, 30 వేల మంది పోలీసు బందోబస్తు, హుస్సేన్ సాగర్లో ప్రత్యేక ఏర్పాట్లు.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి జీహెచ్ ఎంసీ అధికార యంత్రాంగం.. పోలీస్ శాఖ, గణేష్ ఉత్సవ కమిటీలు సన్నద్ధమయ్యాయి. శనివారం హైదరాబాద్లో జరిగే వినాయక నిమజ్జనానికి 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. నిమజ్జనోత్సవానికి రూ.54కోట్లతో ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. హుస్సెన్ సాగర్ తో పాటు 20 చెరువులు,74 కృత్రిమ కొలనుల్లో వినాయక నిమజ్జనాలు జరుగనున్నాయి. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్సాగర్లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను, డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో పెట్టారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. వినాయ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా 56,187 విద్యుత్ దీపాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైపోగా..నిమజ్జనమైన విగ్రహాల వ్యర్థాలను 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్ల ద్వారా ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారే. 15వేల మంది జీహెచ్ ఎంసీ సిబ్బంది నిమజ్జనోత్సవ విధుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటిదాక 1లక్ష 30వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనమయ్యాయి.
శనివారం నిర్వహించే నిమజ్జనోత్సం శోభాయాత్ర ఏర్పాట్లను సీపీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, అదనపు సీపీ విక్రమ్ సింగ్మాన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిడ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ప్రధానంగా బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే రూట్మ్యాప్ను వారు పరిశీలించారు. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సెలవు ప్రకటించారు.
30వేల మంది పోలీసులలో బందోబస్తు : సీపీ ఆనంద్
303 కిలోమీటర్ల మేర శోభాయాత్రలు కొనసాగుతాయన్న అంచనాలతో నిమజ్జనం కోసం 30 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా..వారికి అదనంగా కేంద్ర బలగాలు కూడా బందోబస్తుకు సహకరిస్తాయని ఇప్పటికే సీపీ ఆనంద్ వెల్లడించారు.
ఇందుకోసం నగరంలో 20వేలమంది పోలీసులతో పాటు, ఇతర జిల్లాల నుంచి 9వేల మంది సిబ్బందిన రప్పిస్తున్నట్లు సీపీ ఆనంద్ తెలిపారు. వీరికి అదనంగా కేంద్ర బలగాలు కూడా సహకరిస్తాయని చెప్పారు. సెప్టెంబర్ 6న మిలాద్ ఉన్ నబి ఊరేగింపు, 14న మరోర్యాలీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన దృష్ట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణల మధ్య కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధాన పర్యవేక్షణ నిఘా ఉంటుందని తెలిపారు. వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్రకు సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఊరేగింపు వాహనాలకు చెట్లు, విద్యుత్ వైర్లు అడ్డు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు.
బాలాపూర్ గణేష్ రూట్ మ్యాప్
కట్ట మైసమ్మ దేవాలయం, కేశవగిరి చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్, మహబూబ్నగర్ ఎక్స్రోడ్, ఇంజన్ బౌలి, అలియాబాద్, నాగుల్చింత, జేఎన్ హిమ్మత్ పురా, చార్మినార్, మదీనా ఎక్స్రోడ్, అఫ్జల్గంజ్, ఎంజే మారెట్, అబిడ్స్ జీపీవో, బీజేఆర్ విగ్రహం బషీర్బాగ్ క్రాస్రోడ్, లిబర్టీ అంబేదర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్) వరకు బాలాపూర్ గణేష్ శోభాయాత్ర సాగనుంది.
ఖైరతాబాద్ బడా గణేష్ రూట్ మ్యాప్
ఖైరతాబాద్ బడాగణేష్ పాత పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి అంబేదర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్) వరకు శోభాయాత్ర కొనసాగనుంది.