కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు హాజరై పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయ పరిణామాలు వివరించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించండి
ప్రభుత్వానికి సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్
విధాత : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు హాజరై పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయ పరిణామాలు వివరించారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయ, పాలన పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కూలీలకు, మహిళలకు ఆర్థిక సహాయం చేయాలని తీర్మానంలో డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఈ వానాకాలం నుండే రైతు భరోసా అమలు చేయాలని, పంటల బీమా పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించి అమలు చేయాలని కోరారు. ధరణి సమస్యలు పరిష్కరించాలని, రు.2లక్షల లోపు రుణమాఫీ అమలు చేయాలని, ప్రభుత్వం హామి ఇచ్చిన విధంగా ధాన్యానికి, ఇతర పంటలకు బోనస్ ఇవ్వాలని, వ్యవసాయ ప్రణాళిక వెంటనే ప్రకటించాలని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామి ఇచ్చిన విధంగా నిరుద్యోగభృతి ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని గుర్తు చేశారు. విత్తనాలు, ఎరువులు, రుణసౌకర్యం కల్పించాలని, గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలిచ్చి ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ పథకం క్రింద ఆర్థిక సహాయం చేయాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైనందరికీ హక్కుపత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల అన్ని రకాల బకాయిలు విడుదల చేయాలని తీర్మానంలో డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ కూలీలకు ఏటా రు.12వేలు ఆర్థిక సహకారం చేస్తామని, మహిళలకు నెలకు రు.2500లు ఇస్తామని హామి ఇచ్చిందని, రాష్ట్రంలో 20లక్షల మందికి పైగా కౌలురైతులు 30 శాతానికి పైగా వ్యవసాయం చేస్తున్నారని, రైతుల ఆత్మహత్యల్లో సగం మంది కౌలు రైతులేనని, 2011 చట్ట ప్రకారం లోన్ ఎలిజిబులిటీ కార్డులివ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది.
భూసమస్యలను పరిష్కరించాలి
ప్రజాపాలనలో ఒక కోటి 30 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 70వేలు భూమి సమస్యలేనని, ఈ ధరణి సమస్యల మీద ఇప్పటికే క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యిందని, ప్రభుత్వం దగ్గరే పెండింగ్ ఉన్నదని, తక్షణమే ప్రభుత్వం విధాన నిర్ణయం చేసి సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది.గత మూడేళ్ళుగా రాష్ట్రంలో వ్యవసాయ ప్రణాళికలు ప్రకటించలేదని, ఫలితంగా రైతులు ఏపంటలు వేయాలో స్పష్టత లేక తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికైనా తక్షణమే వ్యవసాయ ప్రణాళిక ప్రకటించాలని సీపీఎం కోరింది. రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన ప్రకారం ఈ ఖరీఫ్లో 70లక్షల ఎకరాల్లో పత్తి, 60లక్షల ఎకరాల్లో వరి పండించబోతున్నారని, అంటే పప్పులు, నూనెలు, ముతకధాన్యాలకు కేవలం 10లక్షల ఎకరాలే మిగులుతాయని, ఇవి అనేక సమస్యలకు దారితీస్తాయని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వ్యవసాయ ప్రణాళిక ప్రకటించి, రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో పంటల బీమా సౌకర్యం లేదని, ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించేవిధంగా పంటల బీమా అమలు చేయాలని, సన్నదాన్యానికే కాకుండా దొడ్డు ధాన్యానికి కూడా బోనస్ ఇవ్వాలని, ఇతర పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది. అలాగే ఫ్రభుత్వ హామీ ప్రకారం రు.2లక్షల వరకు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేయాలని, రుణమాఫీ వెంటనే అమలుచేయగలిగితే వానాకాలం సాగు పెట్టుబడికి రైతులకు ఉపయోగం జరుగుతుందన్నారు. ఆగస్టులోనే రుణమాఫీ చేయాలనుకుంటే ఇప్పుడున్న అప్పులతో నిమిత్తం లేకుండా రైతులకు కొత్తగా రుణాలివ్వాలని, లీడ్ బ్యాంక్ ఇందుకనుగుణంగా రుణ ప్రణాళిక ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, గత బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు, గ్రాట్యుటీ, ప్రభుత్వ జీవిత బీమా, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, కమ్యూటేషన్ వంటి బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయని, గ్రామపంచాయితీ కార్మికులకు 6నుండి 9నెలల వేతనం, మున్సిపల్ కార్మికులకు 3నెలలు, ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 5నెలల బకాయిలు, వైద్యరంగంలో 104ఉద్యోగులకు 8నెలల బకాయిలున్నాయని సీపీఎం తెలిపింది. షెడ్యూల్డ్ ఎంప్లాయీస్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల వేతనాలు చెల్లించి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కనీసవేతనాల డ్రాఫ్ట్ జారీలో జరిగిన లోపాలను సరిదిద్ది, పెరుగుతున్న ధరలకనుగుణంగా జీతాలను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.