బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్ గడ్తో కుదుర్చుకుఉన్న విద్యుత్తు ఒప్పందాలు, యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ నిర్మాణ పనుల్లో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ముందు ట్రాన్స్ కో, జెన్ కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, ఐఏఎస్ ఆఫీసర్, గత ప్రభుత్వంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన అరవింద్కుమార్, మరో మాజీ కార్యదర్శి సురేశ్ చద్దాలు సోమవారం హాజరయ్యారు
విద్యుత్తు అధికారులతో జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ భేటీ
విద్యుత్తు ఒప్పందాలు..ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలపై విచారణ
గొర్రెల స్కామ్ నిందితుల విచారణ షురూ
విధాత, హైదరాబాద్ : : బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్ గడ్తో కుదుర్చుకుఉన్న విద్యుత్తు ఒప్పందాలు, యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ నిర్మాణ పనుల్లో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ముందు ట్రాన్స్ కో, జెన్ కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, ఐఏఎస్ ఆఫీసర్, గత ప్రభుత్వంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన అరవింద్కుమార్, మరో మాజీ కార్యదర్శి సురేశ్ చద్దాలు సోమవారం హాజరయ్యారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్తు ఒప్పందం, యాదాద్రి ఫ్లాంట్ నిర్మాణ అంశాలపై ప్రభాకర్ రావు, అరవింద్ కుమార్ నుంచి జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ వివరాలు సేకరించినట్లు సమాచారం. విద్యుత్తు అంశాల్లో బీఆరెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజనిర్ధారణ కోసం ఇప్పపటికే బహిరంగ ప్రకటన జారీ చేసి ప్రజాభిప్రాయాన్ని కమిషన్ సేకరించింది. చత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రాష్ట్రానికి గుదిబండగా మారనున్నాయని, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో టెండర్ల ద్వారా కాకుండా కాంట్రాక్టులను నామినేషన్ పై కేటాయించడం, కాలం చెల్లిన టెక్నాలజీని ఉపయోగించడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆరెస్ల మధ్య సవాళ్ల పర్వం సాగింది. ఈ నేపథ్యంలో నియమించబడిన నర్సింహారెడ్డి కమిషన్ ఆయా అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తులు, విద్యుత్తు రంగ నిపుణులు, సంస్థల నుంచి సూచనలు కమిషన్ స్వీకరించింది. రాష్ట్రప్రభుత్వానికి వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేందుకు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణను వేగవంతం చేసింది. విచారణలో భాగంగా మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ కమిషన్ల నుంచి వివరాలు సేకరించింది.
కాళేశ్వరంపైన పీసీ ఘోష్ కమిషన్ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల డ్యామేజీ అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సోమవారం మాజీ ఈఎన్సీ మురళీధర్రావు సహా ప్రాజెక్టు నిర్మాణ సమయంలోని ఇంజనీరింగ్ అధికారులను విచారించింది. రెండు రోజులుగా బ్యారేజీలను సందర్శించిన పీసీ ఘోష్ కమిషన్ సోమవారం నుంచి హైదరాబాద్లోనే మకాం వేసి విచారణ కొనసాగించనుంది. ఈఎన్సీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ)లు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్ నర్సింగ్లను ఘోష్ కమిషన్ విచారించింది. బ్యారేజీలకు సంబంధించిన పలు అంశాలపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించారు. . హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను రెండు రోజలుగా పరిశీలించారు.క్షేత్ర స్థాయి పరిశీలన సందర్భంగా ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంత భారీ నిర్మాణాలు చేపడుతున్న సమయంలో కనీస బాధ్యత ఉండదా అంటూ ఇంజినీర్లను నిలదీసినట్లుగా సమాచారం.
నిపుణులైన మీరు ఏ పని ఎలా చేస్తున్నారో తెలుసుకోరా అంటూ నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసంతృప్తి వ్యక్తం చేశారని, సీసీ బ్లాక్స్, బుంగలు ఇతర లోపాలను నిశితంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారని సమాచారం. క్షేత్ర స్థాయిలో తాను తెలుసుకున్న సమాచారం మేరకు అధికారులను సోమవారం విచారణ సందర్భంగా ఆయన ప్రశ్నించినట్లుగా తెలిసింది. ప్రభుత్వం సూచించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లపైన, ప్లానింగ్, డిజైన్స్, నిర్మాణపరమైన వాటితో పాటు ఇతర అంశాలపై ముగ్గురు ఈఈల నుంచి ఘోష్ వివరాలు సేకరించారు. బ్యారేజీల నుంచి సెకనుకు 4.8 నుంచి 5 మీటర్ల వరకు షూటింగ్ వెలాసిటీ ఉండాల్సి ఉందని, దీనికి భిన్నంగా 16 నుంచి 18 మీటర్ల వరకు వస్తోందని, ఈ తేడాలతో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, నిర్మాణాలు దెబ్బతినడం వంటివి సంభవిస్తున్నాయన్న అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారని, బ్యారేజీలో ఇసుక పేరుకుపోవడం, నిర్మాణ సంస్థలు, నీటిపారుదలశాఖతో ఈఈలు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలపైనా కమిషన్ సమాచారం అడిగినట్లుగా తెలుస్తుంది.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు సంబంధించిన విచారణ మరింత ఆలస్యమవుతుందని, జూన్ 30వ తేదీలోగా నివేదిక ఇవ్వలేనని, సమగ్ర విచారణ తర్వాతే నివేదిక అందిస్తానని జ్యుడీషియల్ చైర్మన్ పీసీ ఘోష్ తెలిపారు. సోమవారం ఈఎన్సీ సహా పలువురు ఎస్ఈ, ఈఈల, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆయన విచారించారు.
ఈ సందర్భంగా పీసీ ఘోష్ మాట్లాడుతూ ముందుగా అనుకున్నట్లుగా జూన్ 30 లోపు విచారణ పూర్తి కాదని, ఇంకా సమయం పడుతుందన్నారు. విచారణ వేగంగా జరుగుతుందని, అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయని తెలిపారు. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉందని, అందుకే కొంత విచారణ ఆలస్యమవుతుందని చెప్పారు. విచారణలో భాగంగా ఇప్పటికే ప్రాజెక్టులోని బ్యారేజీలను సందర్శించి పరిశీలించి క్షేత్ర స్థాయి విచారణ చేశానన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా 54 ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులో నష్టపరిహారం అందని ఫిర్యాదులు కూడా వచ్చాయని, వాటిపై విచారణ చేస్తామన్నారు. విచారణకు రావాల్సిన అధికారులకు నోటీస్ ఇచ్చామని, ఇవ్వాళ 7 మందికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని, రేపు 18 మంది విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. నిర్మాణ ఏజెన్సీలను పిలుస్తున్నానని, విచారణ చేస్తున్నామని, నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్దా అన్ని సమాచారం తీసుకుంటున్నామన్నారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తి అయ్యాక, ఆర్థిక, అంశాల పై విచారణ మొదలు అవుతుందని, ప్రభుత్వం వద్ద నుంచి రిపోర్టులు అన్ని అందాయని, వాటి పరిశీలన జరుగుతుందని తెలిపారు.
గొర్రెల స్కామ్ నిందితుల విచారణ షురూ
తెలంగాణలో గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. సోమవారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ లను కస్టడీకి తీసుకున్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వారిద్ధరిని కోర్టు మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అనుమతించింది.దీంతో ఏసీబీ అధికారులు సోమవారం నుంచి మూడు రోజుల పాటు రామ్ చందర్ నాయక్, కళ్యాణ్లను కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. గొర్రెల స్కామ్లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించి పలువురిని అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్లో మొదట రూ. 2.10 కోట్లు దారి మళ్ళినట్టు గుర్తించారు. పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ చందర్ నాయక్ , ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్తో రూ.700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ మోహినూద్దిన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.