Ex MLA Jeevan Reddy | జీవన్రెడ్డి ఆరోపణలు అవాస్తవం : ఆర్టీసీ స్పష్టీకరణ
ఆర్మూర్ బస్ స్టేషన్ మాల్ లీజు వివాదంలో మాజీ ఎమ్మెల్యే ఎ.జీవన్రెడ్డి వాస్తవాలను దాచిపెట్టి ఆర్టీసీపైన, అధికారులపై అసత్య ఆరోపణలు చేశారని ఆర్టీసీ సంస్థ శనివారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది.

లీజ్ బకాయిలపై అబద్ధాల కథనం
ఆర్టీసీ స్పష్టీకరణ
విధాత : ఆర్మూర్ బస్ స్టేషన్ మాల్ లీజు వివాదంలో మాజీ ఎమ్మెల్యే ఎ.జీవన్రెడ్డి వాస్తవాలను దాచిపెట్టి ఆర్టీసీపైన, అధికారులపై అసత్య ఆరోపణలు చేశారని ఆర్టీసీ సంస్థ శనివారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. అర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని 7059చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అద్దెకు ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుందని, ప్రత్యామ్నాయ రెవెన్యూ పెంచుకునేందుకు గాను 33 సంవత్సరాలకు బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీవోటీ) కింద 01.06.2013న ఆ భూమిని లీజ్కు ఇవ్వడం జరిగిందని, ఆ స్థలంలో ఒక షాపింగ్ మాల్ను ఆ కంపెనీ డెవలప్ చేసిందని తెలిపింది. 2017లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితా రెడ్డి టేక్ఓవర్ చేసుకుని.. షాపింగ్ మాల్కు జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్గా పేరుపెట్టారని, థర్డ్ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజ్కు ఇచ్చారని పేర్కోంది.
అద్దె చెల్లించలేదు
ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదని, 2015 అక్టోబర్ వరకు రూ.4.30 కోట్ల బకాయిను సంస్థకు పడిందని, దీంతో అప్పుడే టెర్మినేషన్ ఆర్డర్ను ఆర్టీసీ సంస్థ జారీ చేసిందని, దీంతో రెండు పర్యాయాలు రూ.69 లక్షలను చెల్లించారని, మిగతా బకాయిలను చెల్లించాలని పలుసార్లు నోటీసులు పంపించిన స్పందించలేదని తెలిపింది. గత ఏడాది అక్టోబర్ వరకు రూ.8.65 కోట్ల బకాయిలు ఉన్నాయని, మళ్లీ నోటీసులు జారీ చేయడంతో.. అక్టోబర్ లో రూ.1.50 కోట్లను ఆ కంపెనీ చెల్లించిందని, ఆ తర్వాత షోకాజ్ నోటీసులు పంపించడంతో గత ఏడాది డిసెంబర్ లో విడతల వారీగా రూ.2.40 కోట్లను కట్టారని వెల్లడించింది.
తమ షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టును వారు ఆశ్రయించారని, టీఎస్ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా రెండు కోట్లను చెల్లించారని, ఈ కేసుపై బకాయిలన్నీ నెల రోజుల్లో చెల్లించాలని మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అది ప్రజల డబ్బు అని స్పష్టం చేసిందని పేర్కోంది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల మేరకు లీజు సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీని ఆదేశించిందని, నెల రోజుల గడువు పూర్తయినప్పటికి మొత్తం బకాయిను ఆ కంపెనీ చెల్లించలేదన్నారు. ఇప్పటివరకు రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 9వ తేదిన నోటీసులు ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు షాపింగ్ మాల్ కు వెళ్లారని, ఆ మాల్ లో థర్డ్ పార్టీ స్టాళ్లు ఉండటంతో వారికి సమాచారం ఇచ్చేందుకు మైక్ లో అనౌన్స్ చేయడం జరిగిందని తెలిపింది.
అసత్య ఆరోపణలు విచారకరం
వాస్తవాలు ఇలా ఉంటే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి టీఎస్ఆర్టీసీ, సంస్థ ఉన్నతాధికారులపై అసత్య ఆరోపణలు చేశారని, ఇష్టానుసారంగా నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోందని సంస్థ పేర్కోంది. జీవన్రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే సంస్థ వదిలేస్తోందని, అద్దె బకాయిల విషయంలో లీజ్ ఒప్పందం, హైకోర్టు ఆదేశాల ప్రకారమే సంస్థ నడుచుకుంటోందని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోందన్నారు.
బకాయిలు చెల్లించాలని గత 5 సంవత్సరాలుగా 20కి పైగా నోటీసులను సంస్థ జారీ చేసిందని, తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఆరోపించడంలో ఏమాత్రం నిజం లేదని, జీఎస్టీ కేంద్రానికి చెల్లించడం లేదనడం పూర్తి అర్ధరహితమని, నిబంధనల ప్రకారమే క్రమంతప్పకుండా జీఎస్టీని కేంద్రానికి సంస్థ చెల్లిస్తోందని స్పష్టం చేసింది. బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడటం లేదని, నిబంధనల మేరకే వాటిని వసూలు చేయడం జరుగుతోందని, ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా సంస్థపై, ఉన్నతాధికారులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరికాదని తేల్చిచెప్పింది.