KTR | కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి : కేటీఆర్

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని, పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందని, పల్లె,, పట్టణాలు పారిశుధ్య సమస్యలతో కంపుకొడుతున్నాయని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

KTR | కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి : కేటీఆర్

నిధులు అందక సంక్షోభంలో పంచాయతీలు, మున్సిపాల్టీలు
భారీగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు

KTR | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని, పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందని, పల్లె,, పట్టణాలు పారిశుధ్య సమస్యలతో కంపుకొడుతున్నాయని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ట్విటర్ వేదికగా ఆయన మున్సిపాల్టీలు, పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మున్సిపాల్టీలు, పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు అందక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్ ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో.. పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందని, దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయని ఆరోపించారు.

పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. మీ ప్రజాపాలన అంటే అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆరెస్ పాలనలో ప్రతి నెలా పంచాయితీలకు ఠంచన్ గా రూ.275 కోట్లు విడుదల చేశామని, నేడు పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1800 మాజీ సర్పంచ్ లపై నిర్బంధాలు.. అక్రమ అరెస్టుల పాలు చేశారని విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారని, ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన రూ.2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారని, 12,769 పంచాయితీల్లో పేరుకుపోయిన విద్యుత్తు బకాయిలే రూ.4305 కోట్లని అంచనాగా ఉందని వాటి పరిస్థితి ఏంటని నిలదీశారు. దేశానికే పట్టుగొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించారు.

మున్సిపాల్టీలకు 1200కోట్ల పెండింగ్ బిల్లులు

గ్రేటర్‌తో పాటు.. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందని, రాష్ట్ర బడ్జెట్ లో జీహెచ్ఎంసీకి అరకొర నిధులు కేటాయించడంతో మహానగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా మూలనపడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చెప్పుకునే ప్రజాపాలనలో పల్లె ప్రగతికి పాతరేసి.. పట్టణ ప్రగతిని అడ్రస్ లేకుండా చేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులకు మోక్షం లేదని, కొత్త పనులకు ప్రణాళిక లేదని, నిధులు లేక పూర్తిగా నీరసించిన మున్సిపాలిటీల్లో కనీసం అత్యవసర మరమ్మత్తులకు కూడా పైసలు లేకపోవడం దుర్మార్గం కాదా అని నిలదీశారు. వర్షాకాలంలో అధ్వాన్నంగా మారిన రోడ్లతో ప్రతినిత్యం అవస్థలు పడుతున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారన్నారు. మున్సిపాలిటీల్లో రూ.1200 కోట్లకుపైగా ఉన్న పెండింగ్ బిల్లులను ఇంకెప్పుడు విడుదల చేస్తారన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖకే ఈస్థాయిలో నిధుల కొరత ఉంటే.. ఇక ఇతర శాఖల దుస్థితి ఏమిటన్నారు. ఆగస్టు 15 లోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు సిద్ధమవుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ల కష్టాలను తీర్చే తీరిక ఈ ప్రభుత్వానికి ఉందా అన్నారు. కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నుంచి పురపాలక శాఖను ఇప్పటికైనా గట్టెక్కించే ధైర్యం ఉందా అని, మున్సిపాలిటీల్లో దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీల మరమ్మత్తులను యుద్ధప్రాతిపదికన చేపట్టే ఆలోచన ఉందా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆరెస్‌ హయాంలో పదేళ్లు పచ్చగా కళకళలాడిన పల్లెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణాలు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడటం మీ అసమర్థతకు, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనమని, మీ చేతకానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరిచిపోకండని హెచ్చరించారు.