విధాత, నిజామాబాద్: వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాదు ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదని ఆరోపించారు. అంతేకాదు పక్క రాష్ట్రాల్లో తమ రాష్ట్రం రైతులు వెలిగిపోతున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు ఈ విషయమై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
గత కొన్ని రోజుల నుంచి రైతులు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్నా స్పందన కరువైందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
ఎమ్మెల్యేలు, మంత్రి పట్టించుకోక పొతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. రైతులకు 8 నుంచి 10 గంటలు కూడా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతున్నారని పేర్కొన్నారు. నాణ్యమైన కరెంటు రాకపోవడంతో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి, అనేక నష్టాలకు గురవుతున్నారన్నారు. వెంటనే రైతుల పట్ల నిర్లక్ష్యం వీడి జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు రైతాంగానికి 24 గంటల కరెంటు ఇవ్వాలని, లేకుంటే రాజీనామా చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా, బీజేపీ నాయకులు రైతులు పాల్గొన్నారు.