కాంగ్రెస్‌లో రచ్చ రేపిన కోమటిరెడ్డి ట్వీట్లు..అంతా ఒక్కటేనంటూ ముక్తాయింపు

కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారశైలీ ఎప్పుడు ప్రత్యేకమే. ముక్కుసూటి తనం..

కాంగ్రెస్‌లో రచ్చ రేపిన కోమటిరెడ్డి ట్వీట్లు..అంతా ఒక్కటేనంటూ ముక్తాయింపు

కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారశైలీ ఎప్పుడు ప్రత్యేకమే. ముక్కుసూటి తనం..అదే సమయంలో నిలకడలేని వైఖరులతో పార్టీలో తన రూటే సపరేట్ అన్నట్లుగా ఉంటుంది వెంకట్ రెడ్డి వైఖరి. అధికారంలో ఉన్నా…ప్రతిపక్షంలో ఉన్నా తన స్టైల్ తనదేనంటూ తన అభిప్రాయలు బోల్డ్‌గా చెప్పడం ఆయన తీరు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్వీట్టర్ ఎక్స్ వేదికగా తాను భట్టి విక్రమార్కతో కలిసివున్న ఫోటోను షేర్ చేస్తూ కొత్త శకాన్ని నిర్మిద్దాం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.



ఇంకేముంది ఇదే అదనుగా సీఎం రేవంత్ ఫోటో లేకుండా భట్టితో వెంకన్న పెట్టిన ట్వీట్‌ను ఆసరాగా చేసుకున్న ప్రత్యర్థి పార్టీలు అదిగో అప్పుడే కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయని కామెంట్లతో దండెత్తారు. దీంతో తేరుకున్న వెంకట్‌రెడ్డి మరుసటి రోజు తనతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్న ఫోటోను జతచేస్తూ సలార్ సినిమాలోని పాటను కోడ్ చేస్తూ మేమంతా ఒకటే నంటూ తమ ఐక్యతను చాటుతూ మరో ట్వీట్ పోస్టు చేశారు. వేగమొకడు. త్యాగమొకడు గతం మరువని గమనమే ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే. ఒకరు గర్జన. ఒకరు ఉప్పెన వెరసి ప్రళయాలే. సైగ ఒకరు సైన్యం ఒకరు కలిసి కదిలితే కదనమే.” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో సలార్ మూవీ పాటతో రూపొందించిన వీడియోను ట్వీట్ చేశారు.


అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందుగా భట్టితో మాత్రమే తన ట్వీట్ ఎందుకు పెట్టారు..? దానిపై ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శల నేపధ్యంలో సీఎం రేవంత్‌రెడ్డితో కూడిన ట్వీట్ మళ్లీ ఎందుకు పెట్టారన్నదానిపై ఎవరకి తోచిన విధంగా వారు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ శ్రేణులు మాత్రం మా నాయకులు ఇలా ఐక్యంగా ఉండాలని కోరుకుంటు వెంకట్‌రెడ్డి ట్వీట్లను సానుకూలంగా తీసుకుంటున్నారు.



ఇది ఇలా ఉంటే బొటాబోటీ మెజార్టీ మాత్రమే ఉన్నసీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సొంత పార్టీలో ఏ చిన్న తేడా వచ్చిన పడగొట్టేందుకు ప్రతిపక్ష బీఆరెస్ పొంచివుంది. ఈ నేపధ్యంలో వెంకట్ రెడ్డి ట్వీట్లు కాంగ్రెస్‌తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారి హీట్ పెంచాయని భావిస్తున్నారు. అసలు వెంకట్ రెడ్డి అలా ఎందుకు చేశారన్నదానిపై శూలశోధనలు సాగిస్తున్నారు.