దండకారణ్య సరిహద్దు పై ఎన్నికల కమిషన్ పెట్టిన ప్రత్యేక ఫోకస్ ఫలించింది. అక్కడ ఎన్నికల నిర్వహణను సవాల్ గా తీసుకుని సక్సెస్ చేసింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఎన్నికల కమిషన్ ప్రణాళిక సక్సెస్
ఊపిరిపీల్చుకున్న గిరిజనం
తెలంగాణలో 13 అసెంబ్లీ సెగ్మెంట్లు
ఏపీలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు
నిఘా కోసం డ్రోన్ల వినియోగం
అడవిని జల్లెడపట్టిన బలగాలు
విధాత ప్రత్యేక ప్రతినిధి: దండకారణ్య సరిహద్దు పై ఎన్నికల కమిషన్ పెట్టిన ప్రత్యేక ఫోకస్ ఫలించింది. అక్కడ ఎన్నికల నిర్వహణను సవాల్ గా తీసుకుని సక్సెస్ చేసింది. పోలింగ్ కోసం అధికారులు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పటిష్టంగా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. భారీగా సాయుధ బలగాలను దించారు. పోలింగ్ కు సాధారణ పోలీసులతో పాటు వివిధ రకాల సాయుధ బలగాలను వినియోగించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద డేగ కళ్ళ నిఘా కొనసాగించారు. మరో వైపు గత మూడు నెలలుగా అప్పటికే నిర్వహిస్తున్న కూంబింగుకు తోడు అదనంగా ఏజెన్సీ ప్రాంతాలు, ముఖ్యంగా చత్తీస్ గడ్, మహారాష్ర, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దండకారణ్య ప్రాంతాన్ని అణువనువు జల్లెడపడుతున్నారు. చీమచిటుక్కుమన్నా పసిగట్టే విధంగా కూంబింగ్ తో పాటు పెద్ద ఎత్తున స్పెషల్ పార్టీ, సాయుధ బలగాలను దింపారు.
హెలికాప్టర్ లు, డ్రోన్ లు ఇతరత్రా ఆధునిక పరికరాలు, ఆయుధాలు ఉపయోగించి మావోయిస్టులను నిలువరించే ప్రయత్నం చేపట్టారు. ఈ మేరకు కూంబింగులతో పాటు వరుసగా జరిగిన ఎన్ కౌంటర్లతో దుర్భేధ్యమైన అబూజ్ మడ్ ప్రాంతం రక్తసిక్తమైంది. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఈ సరిహద్దు దండకారణ్యప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్లు జరిగాయి. దాదాపు 105 మంది మావోయిస్టులు ఈ మధ్యకాలంలో ఎన్ కౌంటర్లలో మృతి చెందినట్లు చెబుతున్నారు. ప్రధానంగా మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ నినాదం నేపథ్యంలో పోలింగ్ కు ఎలాంటి అంతరాయం కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు కేంద్ర బలగాలను సైతం రంగంలోకి దింపి మావోయిస్టులను కట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులు కొంత సక్సెస్ అయ్యారనే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ ను సజావుగా నిర్వహించగలిగారని భావిస్తున్నారు.
ఉత్తర తెలంగాణ అటవీ ప్రాంతాలు
రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ అటవీ ప్రాంతాలుగా గుర్తింపు పొందిన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఈ 13 అసెంబ్లీ సెగ్మెంట్లు సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. ఒక విధంగా ఇక్కడ గెలుపోటములను ఈ నియోజకవర్గాలు నిర్ణయింస్తాయంటే అతిశయోక్తి కాదు. ఈ 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో భూపాలపల్లి, ములుగు, ఇల్లందు, పినపాక, భద్రాచలం, అశ్వరావుపేట, కొత్తగూడం, సిర్పూరు, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని నియోజకవర్గాలున్నాయి. దండకారణ్యానికి, గోదావరి నదికి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. మావోయిస్టు ప్రభావం తీవ్రంగా ఉన్న చత్తీస్ గడ్, మహారాష్ట్ర, జార్డండ్. గోదావరి ప్రాంతాల సరిహద్దుల్లో ఈ నియోజకవర్గాలున్నాయి. చెందారు. ముందుగా ప్రకటించిన మేరకు తెలంగాణలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ కార్యక్రమాన్ని ముగించారు.
పోలింగ్ కోసం హెలికాప్టర్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని మావోయిస్టు ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకున్నది. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ లోని నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా మావోయిస్టు ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని హెలికాప్టర్ ద్వారా తరలించేందుకు చర్యలు చేపట్టారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న ఏజెన్సీలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎన్నికల కమిషన్ ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పోలింగ్ సమయాన్నితగ్గించి ఎన్నికలు చేపట్టింది. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమయ్యే విధంగా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. సాయంత్రం నాలుగు, ఐదుగంటల వరకే పోలింగ్ ముగిస్తే చీకటిపడే లోపు ఈవిఎంలతో పాటు సిబ్బందిని సురక్షితంగా కౌంటింగ్ కేంద్రాలకు తరలించే అవకాశముంటుందని భావించి ఈ మేరకు పోలింగ్ సమయాన్ని కుదించారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఓట్లేసేందుకు ఓటర్లు కిలోమీటర్ల దూరం నడిచొచ్చి, డోలీల్లో తరలివచ్చి ఓటేశారు. తెలంగాణలోని 13 సెగ్మెంట్లలో నాలుగు గంటలకే పోలింగ్ ముగించారు. ఏపీలో మాత్రం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు పాడేరు, రంపచోడవరం, అరకు పరిధిలో నాలుగు గంటల వరకు, మరో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఐదు గంటల వరకు పోలింగ్ ముగించారు. ఇవిగాకుండా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ముందుగా ప్రకటించిన సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నవారికి మాత్రం ఓటింగ్ ముగిసే వరకు పోలింగ్ సాగింది. దీంతో ఎన్నికల కమిషన్ గుర్తించిన సమస్యాత్మక, అత్యంతసమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఊపిరి పీల్చుకున్న అన్ని వర్గాలు
పోలింగ్ ప్రశాంతంగా ముగిసినందున ఎన్నికల కమిషన్, పోలిసు వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి ఈ ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేత పేరుతో సాగుతున్న కూంబింగులతో సరిహద్దు అటవీప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు కంటిమీద కునుకులేకుండా జీవిస్తున్నారు. పోలీసుబలగాలతో పల్లెలు దద్దరిల్లాయి. ప్రస్తుతం పోలింగ్ ముగిసినందున కూంబింగ్ దళాలు, భారీ బలగాలు కొంత వెనక్కు తగ్గే అవకాశం ఉంటుందని స్థానికులు ఎదురుచూస్తున్నారు. నిత్యం పోలీసుల బూట్ల శబ్దంతో తల్లడిల్లిపోతున్న సామాన్యులకు కాసింత ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నారు.