పోటీ పరీక్షల మధ్య నెల వ్యవధి ఉండాలి
సమగ్ర కుటుంబ సర్వే తీస్తే కుల, జన గణనకు పరిష్కారం
మెదక్ ఎంపీ రఘునందన్రావు
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ కంటే బీజేపీలోకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వస్తారని, రాజీనామా చేసి రావాలని చెప్పడంతో చేరికలు ఆలస్యమవుతున్నాయని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతోందని విమర్శించారు. గ్రూప్ 1 పోస్టులు తక్కువ ఇచ్చారని గతంలో కాంగ్రెస్ చెప్పిందని.. అధికారంలోకి వచ్చాక కేవలం 60 పోస్టులు మాత్రమే పెంచిందన్నారు. చదువుకున్న వారికే పోటీ పరీక్షల విలువ తెలుస్తుందని, ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య 30 రోజుల కాల వ్యవధి ఉండాలని డిమాండ్ చేశారు.
రూ. లక్షల జీతం తీసుకునే సీఎం రేవంత్రెడ్డి వద్ద నిరుద్యోగ భృతి ఇవ్వడానికి డబ్బులు లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేస్తామన్న కుల, జన గణన ఏమైందని రఘునందన్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వే బయటకు తీస్తే 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. పంచాయతీ, ఎంపీటీసీ పదవీకాలం ముగిసి నెలలు గడుస్తున్నా.. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదని మండిపడ్డారు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఏం మారలేదని, రైతు భరోసా 15000 ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు.