విధాత: సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.52 కోట్లతో నిర్మితమవుతున్ననూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. కలెక్టరేట్ ప్రాంగణమంతా కలియ తిరిగారు. భవనంలో వివిధ విభాగాల కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలను కూడా పరిశీలించారు.
నిర్మాణాలకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకే గొడుగు కిందకు జిల్లాలోని అన్ని కార్యాలయాలతో సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించడం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే సాధ్యమైందన్నారు.
సమీకృత భవనంలో 28 విభాగాల కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి కలెక్టరేట్లో మంత్రుల కోసం ‘స్టేట్ చాంబర్’ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సమీక్షలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారన్నారు.
ప్రజల మేలు కోసం ఇంతటి గొప్ప ఆలోచన కేసీఆర్ మాత్రమే చేశారన్నారు. ప్రస్తుతం కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తి కావస్తుండగా, భవన ఆధునీకరణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటి పచ్చదనం ఉట్టి పడేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.