కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ నివేదిక రాగానే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు
విధాత : కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ నివేదిక రాగానే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో వివిధ శాఖలపై బుధవారం పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో జరిగిన పనులపై ఫిర్యాదులు ఉన్నాయని వీటన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నగరంలో నిర్మించిన పలు జంక్షన్లకు కావాలనే అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పనుల్లో పారదర్శకత పాటించకపోతే కాంటాక్టర్లను వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. త్వరలోనే కరీంనగర్ స్మార్ట్ సిటీ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో భేటీ
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డితో రాష్ట్ర బొగ్గు గనుల వేలం నిర్వాహణ అంశంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి పొన్నం చర్చించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా పరస్పరం విమర్శల దాడులు చేసుకున్న కేంద్ర -రాష్ట్ర మంత్రులు ఎన్నికల పోరు ముగిశాక రాష్ట్ర అభివృద్ధిపై చర్చించుకోవడం స్వాగతించేదగ్గ పరిణామంగా నిలిచింది.