హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విధాత): 8 సంవత్సరాలుగా బీజేపీ ప్రజలను దోచుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం తాగిందని విమర్శించారు. జీఎస్టీతో పేదలకు లబ్ది చేసినట్టు బీజేపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారు, జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అని మొదటి నుండి చెప్తున్నామన్నారు. మంగళవారం మంత్రి పొన్నం గాంధీ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పేదలను దోచుకోవడానికే కేంద్రంలోని బీజేపీ పెద్దలు జీఎస్టీ తీసుకువచ్చారని మండిపడ్డారు. శవ పేటికలపై, పసి పిల్లల తినుబండారాలపై కూడా జీఎస్టీ వేశారని విమర్శించారు.
జీఎస్టీ తో ఏదైనా మంచిపని చేశారా అని మంత్రి ప్రశ్నించారు. ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికే మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. తెలంగాణకు 7 వేల కోట్ల నష్టం వస్తోంది. దీన్ని పూడ్చే బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. తెలంగాణ ఎంపీలు, కేంద్ర మంత్రి సంజయ్, కిషన్ రెడ్డి లు తెలంగాణకి వస్తున్న నష్టాన్ని ఎలా పుడుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అండగా ఉండాలని సూచించారు.
జీఎస్టీ తెచ్చి పేదల నడ్డి విరిచింది మీరే… ఇప్పుడు తగ్గించింది మీరేనని, జీఎస్టీ తగ్గింపు అంత ఎన్నికల డ్రామా.. ఇంకా జీఎస్టీ ఫలాలు పేదోడి కి అందలేదని అన్నారు. జీఎస్టీ స్లాబుల పేరుతో ప్రతి వస్తువు మీద అదనపు పన్నులు వేసి పేదలు మోయలేని భారాన్ని వేశారన్నారు. జీఎస్టీ వచ్చి 8 సంవత్సరాలు అయింది.. 8 సంవత్సరాల తర్వాత ప్రజలకు ఇన్ని వేల కోట్లు ఆదా అవుతున్నాయని చెబుతున్నారు.. అంటే 8 సంవత్సరాలు మీరు ప్రజల రక్తం పీల్చుకు తిన్నట్టే కదా అని నిలదీశారు.
మా నాయకుడు రాహుల్ గాంధీ మొదటి నుంచి చెబుతున్నారు.. ఇది జీఎస్టీ కాదు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని, ఇది సహేతుకంగా లేదు.. స్లాబులు కాదు రేట్లు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారన్నారు. కాని కేంద్ర ప్రభుత్వ మాత్రం పెడచెవిన పెట్టిందన్నారు. మీరు తెచ్చిన జీఎస్టీ లో 18, 24 శాతలలో ప్రజలు అధికంగా వినియోగించే వస్తువులు చేర్చారన్నారు. పది సంవత్సరాలపాటు జీఎస్టీ రూపంలో దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడిచిన ఆరు మాసాల కాలంలో 22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల విశాఖపట్నంలో మాట్లాడారు.. దీనిని బట్టి జీఎస్టీ రూపంలో పిండేసి ఇప్పుడు వెన్నపూసినట్లుగా 5, 18 శాతం మాత్రమే పరిమితం చేస్తున్నట్లు చెప్తున్నారని విమర్శించారు. జీఎస్టీ తో నిత్యావసర వస్తువుల ధరలు డబుల్ అయ్యాయి.10 రూపాయలు ఉన్న ఉప్పు పాకెట్ 20 రూపాయలు అయింది..60 రూపాయలు ఉన్న కందిపప్పు 160 రూపాయలు అయింది..70 రూపాయలు ఉన్న ఆయిల్ పాకెట్ 160 రూపాయలు అయిందని అన్నారు. మీరు వేసిన జీఎస్టీ రొట్టెలు తినే పేదవాడి మీద ఎక్కువ జీఎస్టీ లగ్జరీ వస్తువుల మీద మాత్రం తక్కువ జీఎస్టీ ఉండేది.. ఫైవ్ స్టార్ హోటల్లో ఫుడ్ కి తక్కువ జీఎస్టీ వేస్తే చిన్న హోటల్లో కప్పు టీ కి మాత్రం ఎక్కువ జీఎస్టీ వేసి దోచుకున్నారని మండిపడ్డారు.
పెట్రోల్ ,డీజిల్ జీఎస్టీ లో చేర్చాలని తద్వారా పన్ను రేటు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుందని చాలా రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి.. ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తేలేదని అన్నారు. మీరు శవ పేటికలకు కూడా జీఎస్టీ వేశారు, శవాలను దహనం చేసే సమయంలో చెల్లించే సొమ్ముపై జీఎస్టీ తీసేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇప్పుడు మీరు తగ్గించిన జీఎస్టీ ఫలాలు పేదోడి కి ఎంత వరకు అందుతాయో చూడాలి.. నిన్న తగ్గిన జీఎస్టీ అమలులోకి వచ్చిన పాత ధరలే తీసుకున్నట్లు వార్తలు చూశామన్నారు.
తెలంగాణ రాష్ట్రం కొత్త జీఎస్టీ వల్ల ప్రతి సంవత్సరం 7000 కోట్ల రూపాయలు నష్టపోతుంది, రాష్ట్రాలు నష్టపోతున్న దానిని కేంద్ర ప్రభుత్వమే భరించాలన్నారు. జీఎస్టీ తగ్గించి కేంద్ర ప్రభుత్వం మీ చావు మీరు చావండి అన్న విధంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. సంక్షేమం మొత్తం రాష్ట్రాల మీద రుద్దుతున్నారు.. కేంద్ర ప్రభుత్వ మాత్రం సెస్ ల పేరుతో దండుకుంటున్నారని ఆరోపించారు. జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు 10 సంవత్సరాల పాటు రాష్ట్రాల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది అని చెప్పారు.. కానీ పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్న 7 వేల కోట్ల రూపాయల పై మాకు ఎంత ఇస్తారో ప్రామిస్ చేయాలన్నారు. రాష్ట్రాలు నష్టపోతున్న దానిపై తెలంగాణలోని కేంద్ర మంత్రుల కిషన్ రెడ్డి ,బండి సంజయ్ లు కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడించాలి..మీరు కేంద్రం నుండి స్పష్టత ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.