Sridhar Babu : విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్ తెలంగాణ
తెలంగాణ పరిశ్రమలాభివృద్ధి కోసం 'జీటో కనెక్ట్ 2025' ప్రారంభం, మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడుల కోసం వ్యాపారులకు ఆహ్వానం చేశారు.

హైదరాబాద్, అక్టోబర్ 03 (విధాత): ‘విలువలతో కూడిన వృద్ధి’కి కేరాఫ్ గా తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జీటో) హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైటెక్స్, హెచ్ఐసీసీలలో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న ‘జీటో కనెక్ట్ 2025’ను కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహాకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచన తీరు కూడా మారిందన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా వృద్ధి నైతికమైనదా, సమ్మిళితమైనదా, సుస్థిరమైనదా..? అని అధ్యయనం చేసిన తర్వాతే అడుగు ముందుకేస్తున్నారన్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తునే తెలంగాణ నిర్మిస్తోందన్నారు. తెలంగాణ అవకాశాల ఖని అని, పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత అనుకూల పరిస్థితులున్నాయని వివరించారు. ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఒక్కసారి తెలంగాణలో పర్యటించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరారు. జైన సమాజం ‘సేవా’ స్ఫూర్తిని, తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ తో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతమవుతుందన్నారు. నిజమైన యూనికార్న్ అంటే బిలియన్ డాలర్ల విలువ కాదని, లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయడమని యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, జీటో హైదరాబాద్ ఛాప్టర్ ప్రతినిధులు రోహిత్ కొఠారి, లలిత్ చోప్రా, విశాల్ అంచాలియా, బీఎల్ భండారీ, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.