రామాలయం కూల్చివేత వ్యాఖ్యలపై మండిపాటు
విధాత : ప్రచారంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రధాని మోడీ వ్యవహారించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన జీవన్రెడ్డి కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని మోదీ ప్రచారం చేయడం దారుణమన్నారు. ప్రధాని మోదీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్ గాంధీ ప్రభుత్వం అని తెలిపారు.
కోర్టు తీర్పును గౌరవించి హిందువుల మనోభావాలు గౌరవించే విధంగా రామ్ లల్లా గేట్స్ తెరిచించారని గుర్తు చేశారు. రామాలయం గేట్స్ తెరిచినప్పుడు మోదీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే 1989 శిలన్యాస్ చేశారని, గుడి శంకుస్థాపనకి అనుమతి ఇచ్చింది రాజీవ్ గాంధీయేనని, రాజీవ్ గాంధీ బతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పారు.
బీజేపీ ఎన్నికల కోసం గుడిని వాడుకోవడం వల్లనే వివాదం ఏర్పడుతుందన్నారు. దేశంలో ధార్మిక చింతనను పెంపొందించింది రాజీవ్ గాంధీ అని, ఆయన పీఎంగా ఉన్నపుడు దూరదర్శన్లో రామాయణ, మహా భారతాలు ప్రసారమయ్యాయని, ఆదర్శ దేవుడిగా.. పాలనలో ప్రజాభిప్రాయాన్ని విలువని ఇచ్చింది శ్రీరాముడని, దూరదర్శన్లో ఎవరి ఆలోచన విధానానికి అనుగుణంగా టెలికాస్ట్ అయ్యాయి? హిందువుల మనోభావాలు గౌరవించేది గాంధీ కుటుంబమని చెప్పారు.
సెక్యులరిజం అంటే అందరి భావలను గౌరవించడమే’’ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కోసం బీజేపీ దేవుడిని వాడుకోవడం మంచిది కాదన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారనన్న మోదీ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ విద్వేషపూరితంగా, చౌకబారు ఆరోపణలు చేశారని, ప్రధాని స్థాయిని దిగజార్చరని విమర్శించారు.