Site icon vidhaatha

Panchayat Elections|  ఆగస్ట్‌లో పంచాయతీ ఎన్నికలు! ఐదేళక్రితం రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు : సీఎం రేవంత్‌రెడ్డి

మొదటివారంలో కొత్త ఓటరు జాబితా
నిర్దిష్ట గడువుతో బీసీ కమిషన్‌ నివేదిక
ఆ నివేదిక ఆధారంగా ఎన్నికల నిర్వహణ
అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్‌: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించ‌డానికి ఉన్న ఆటంకాలు ఏమిట‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. భార‌త ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) నుంచి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి (ఎస్ఈసీ) నూత‌న ఓట‌ర్ల జాబితా రావాల్సి ఉంద‌ని అధికారులు తెలిపారు. అందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల‌కు ఈసీఐ జాబితా పంపింద‌ని, మ‌న‌తో పాటు మ‌రో ఆరు రాష్ట్రాల‌కు మ‌రో వారంలో జాబితాలు పంపిస్తుంద‌ని అధికారులు స‌మాధాన‌మిచ్చారు. జాబితా రాగానే వెంట‌నే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. వారంలోపే ఆయా స్థానిక సంస్థ‌ల‌కు త‌గిన‌ట్లు ఓట్ల‌ర్ల జాబితాలు రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి బీసీ క‌మిష‌న్ సైతం నిర్దిష్ట గ‌డువులోగా త‌మ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేసి, ఆగ‌స్టు నెల చివ‌రి వ‌ర‌కు పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఐదేండ్ల క్రితం ఎన్నిక‌ల్లో కేటాయించిన‌ రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారమే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని, ఆగస్ట్‌ నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన‌ట్లు చెబుతున్నారు. ఆగస్ట్‌ మొదటివారం లోగా కొత్త ఓటరు జాబితాను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌కు ముఖ్యమంత్రి సూచించారు. బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి వారం రోజుల క్రితం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని అధికారులకు సీఎం సూచించారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును రేవంత్‌కు అధికారులు వివరించారు. ఇప్పటికే కులగణనకు ఆమోదం తెలిపినందున, దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కర్ణాటకలో 2015లో, బీహార్‌లో 2023లో కుల గణన చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేసినా వివరాలు ఇంకా బయట పెట్టలేదని అధికారులు వివరించారు. 2011లో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కులగణన ఫార్మాట్‌ 53 కాలమ్స్‌తో ఉన్నదని, దానికి మరో మూడు కాలమ్స్‌ జోడించి కులగణన చేపడితే కనీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ల పెంపు అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది. మొత్తానికి ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల్లో కేటాయించిన రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కార‌మే పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు సమాచారం. స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌, బీసీ సంక్షేమ‌ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్య‌ద‌ర్శులు చంద్రశేఖర్ రెడ్డి, వేముల శ్రీ‌నివాసులు, సంగీత స‌త్యానారాయ‌ణ‌, అజిత్ రెడ్డి, అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ సుద‌ర్శ‌న్‌రెడ్డి పాల్గొన్నారు.

Exit mobile version