గరీబోడికి బలమైన ఆయుధం ఓటు అని, ఓటు విలువ ఎంత గొప్పదో ఆలోచన చేయాలని మాజీ ఎమ్మెల్యే,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధూకర్ అన్నారు.
ప్రజాసంక్షేమం, అభివృద్ది గురించి ఆలోచన చేయాలే
కొప్పులను గెలిపించుకునే బాధ్యత మనందరిది
పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
విధాత ప్రతినిధి, పెద్దపల్లి: గరీబోడికి బలమైన ఆయుధం ఓటు అని, ఓటు విలువ ఎంత గొప్పదో ఆలోచన చేయాలని మాజీ ఎమ్మెల్యే,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధూకర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాటారం మండలం దేవరంపల్లి, దామెరకుంట గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హమీ పని ప్రదేశాల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటు విలువ తెలుసుకోకపోతే మన బాగుపడబోమని గుర్తించాలన్నారు.
మన ఓటుతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన మంథని ఎమ్మెల్యే నిన్నటి వరకు అనేక సమావేశాల్లో భయబ్రాంతులకు గురి చేశారని, ఇప్పటి వరకు 35ఎంఎం ట్రైలర్ చూపించామని, ఇక నుంచి 70ఎంఎం సినిమా చూపిస్తామని మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. అలాంటి ఎమ్మెల్యే ఈనాడు మన ఓటు కోసం ఉపాధి హమీ పని ప్రదేశాలకు వచ్చి గరీబోళ్ల నడుమ కింద కూర్చున్నాడని, ఓటుకు ఉన్న విలువ అలాంటిదని ఆయన వివరించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్సోళ్ల మాటలు నమ్మి నాలుగు నెలలుగా గోసపడుతున్నామని,మళ్లీ నమ్మితే ఐదేండ్లు ఆగమై పోతామని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు ప్రజలకు ఇబ్బందులు రానియ్యలేదని, ప్రజల అవసరాలను గుర్తించే పథకాలకు రూపకల్పన చేశారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా నాలుగున్నర ఏండ్లు ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించానని, అభివృద్ది పనులు చేస్తే బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడని కాంగ్రెస్సోళ్లు బదనాం చేసి ప్రజల నుంచి దూరం చేశారని అన్నారు.
గత ఎన్నికల్లో వంద కోట్లు ఖర్చు చేసి అధికారం చేజిక్కించుకున్నది ఎవరో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. తనలాంటి గరీబోళ్లు పైకి రావద్దని, రాజకీయంగా ఎదుగవద్దని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. అబద్దాలను నమ్మి మళ్లీ మోసపోవద్దని సూచించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సేవలు, అభివృద్ది పనులు చేసిన కొప్పుల ఈశ్వర్ను ఆశీర్వదించాలని కోరారు.