అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో పేర్కోన్న హామీలను చాలవాటిని అమలు చేసినప్పటికి హామీలు అమలు చేయలేదని మాజీ సీఎం కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేయడం సిగ్గుచేటని
విధాత : అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో పేర్కోన్న హామీలను చాలవాటిని అమలు చేసినప్పటికి హామీలు అమలు చేయలేదని మాజీ సీఎం కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేయడం సిగ్గుచేటని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విమర్శించారు . భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం చండూరులో ఏర్పాటు చేసిన రోడ్డు షో లో ఆయన మాట్లాడారు. ఏది ఏమైనా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు దోచుకుని అప్పులపాలు చేసి కేసీఆర్ ఖజానా ఖాలీ చేసి చిప్ప అప్పజెప్పారని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలతో బిడ్డ జైలుకు వెళ్లినా కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతున్నాడని నిలదీశారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. బీజేపీ, బీఆరెస్ల మధ్య పార్లమెంటు ఎన్నికల్లో చీకటి ఒప్పందాలు ఉన్నాయని, బీఆరెస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. బీజేపీ, బీఆరెస్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాజాగోపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లకు ధీటుగా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, చండూరులో ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ నన్ను ఎంపీగా గెలిపించిన పక్షంలో సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో, కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతుతో ఈ ప్రాంత అభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత, సీపీఐ జిల్లా కార్యదర్శి నేలికంటి సత్యం వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.