బైక్, ఆటో, కారు ట్యాక్సీ సేవలను అందించే ప్రముఖ ట్రాన్స్పోర్ట్ సంస్థ ర్యాపిడో తమ వినియోగదారులకు ఓ గుడ్న్యూస్ను ప్రకటించింది. తెలంగాణలో ఎన్నికలు జరిగే మే 13న ఫ్రీ రైడ్ వెసులుబాటును కల్పించింది. ఓటింగ్ శాతాన్ని పెంచడంలో తమవంతు పాత్ర పోషించే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ర్యాపిడో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా ఎన్నికలు జరిగే మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లే ఓటర్లు ఫ్రీ రైడ్ ను పొందొచ్చు. ర్యాపిడో యాప్లో VOTENOW అనే కోడ్ ను ఉపయోగించి ఫ్రీ రైడ్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.
దీనికై ర్యాపిడో సంస్థ ఎన్నికల సంఘంతో సంయుక్తంగా పని చేస్తోంది. ఈ ఆఫర్ కు సంబంధించి ఎల్బీ స్టేడియంలో ర్యాపిడో సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హాజరయ్యారు. పోలింగ్ రోజున దేశ వ్యాప్తంగా 100 నగరాల్లో దాదాపు 10 లక్షల మంది ర్యాపిడో కెప్టెన్లు పోలింగ్ శాతం పెంచే మంచిపనిలో కీలక పాత్ర పోషిస్తారని ర్యాపిడో తెలిపింది. ఫ్రీ రైడ్ ఆఫర్ తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వంటి ర్యాపిడో సర్వీస్ అందుబాటులో ఉన్న నగరాలకు కూడా వర్తించనుంది.
తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, 2024 సాధారణ ఎన్నికల సమయంలో ఓటర్లకు ఉచిత రైడ్లను అందించడానికి ర్యాపిడో తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమనీ, ఓటర్లకు ప్రత్యేకించి దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఉచిత రైడ్ ఇవ్వడం వల్ల వారు పోలింగ్ కేంద్రానికి రావడానికి చాలా ఉపకరిస్తుందని, అర్హులైన ప్రతి పౌరుడు వారి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోగలరని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.