CM Revanth Reddy | బీఆరెస్ ‘కూలేశ్వరం’ నేతలను ఉరి తీయాలి : సీఎం రేవంత్
రాష్ట్రంలో కొత్తగా 5.6 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు చేశామని, 26 లక్షల మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డులలో నమోదు చేశామని తెలిపారు. 3.10 కోట్లమంది కి సన్నబియ్యం పంపిణీ చేశామన్నారు. 65 లక్షల మంది స్వయం సహాయ సంఘాల మహిళలకు 2 చీరలు పంపిణీ చేయబోతున్నామని సీఎం వెల్లడించారు.

CM Revanth Reddy | కేసీఆర్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 60 ఏళ్ల క్రితం కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, జూరాల లాంటి ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి? కాళేశ్వరం ఎలా ఉందో చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో చేసిన దానికి మిమ్మల్ని ఉరితీసినా పాపం లేదని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుమలగిరిలో నిర్వహించిన భారీ సభలో లబ్ధిదారులకు తెల్లరేషన్ కార్డులను అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో పేదలు సుభిక్షంగా ఉండాలని సన్నబియ్యం ఇచ్చామని చెప్పారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం అని అభివర్ణించారు. తుంగతుర్తి గడ్డకు గొప్ప చరిత్ర ఉందని, నల్లగొండ, తుంగతుర్తి సాయుధ రైతాంగ పోరాటం నడిచిన గడ్డలని గుర్తు చేశారు. నల్లగొండ చరిత్రనే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి లేదని చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టు కట్టి నల్లగొండ రైతులకు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. తుంగతుర్తికి గోదావరి జలాలు తీసుకువచ్చి తీరుతాము ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఉంటే గోదావరి జలాలు మూడు రోజులలో తీసుకు వస్తారని బీఆరెస్ నేతలు చెబుతున్నారన్న రేవంత్రెడ్డి.. గోదావరి జలాలు తీసుకురావడం గ్లాస్లో సోడా కాదని సెటైర్లు వేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నపుడు ఎందుకు గోదావరి నీళ్లు తీసుకురాలేదని నిలదీశారు. ‘సొంత మండలానికి ఎంఆర్వో ఆఫీస్ తీసుకురాని సన్నాసి మమల్ని అంటావా? 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆరెస్వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? పేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన ఎందుకు రాలేదు?’ అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నదని చెప్పారు. బీఆరెస్ హయాంలో గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉంటే.. తమ ప్రభుత్వంలో సన్నబియ్యం కోసం జనం బారులు తీరుతున్నారని అన్నారు. ఇది చూసి కొందరు తమ ప్రభుత్వంపై కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు.
ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం
రైతులకు 500 రూపాయల బోనస్, సన్నబియ్యం, రైతు భరోసా, రైతు రుణ మాఫీ లాంటి పథకాలు ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని రేవంత్రెడ్డి చెప్పారు. 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేసి రుణ విముక్తి కల్పించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదంటూ బీఆరెస్ దుష్ప్రచారం చేసిందన్న రేవంత్రెడ్డి.. తమ ప్రభుత్వం 9 రోజులలోనే 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేసి వాళ్లలో సంతోషం నింపిందని చెప్పారు. ‘వ్యవసాయం దండుగ కాదు పండుగ’ అని నిరూపించామని చెప్పారు. ‘2.85 లక్షల ధ్యానం పండించి దేశం లోనే నెంబర్ 1 గా నిలిచాం’ అని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 5.6 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు చేశామని, 26 లక్షల మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డులలో నమోదు చేశామని తెలిపారు. 3.10 కోట్లమంది కి సన్నబియ్యం పంపిణీ చేశామన్నారు. 65 లక్షల మంది స్వయం సహాయ సంఘాల మహిళలకు 2 చీరలు పంపిణీ చేయబోతున్నామని సీఎం వెల్లడించారు.
6500 కోట్లతో ఉచిత ప్రయాణాలు
ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని సీఎం చెప్పారు. అందుకు 6,500 కోట్ల రూపాయల ఖర్చు చేశామని తెలిపారు. ‘మహిళా సంఘాలకు బస్లు కొనిస్తున్నాం.. పెట్రోల్ బంక్ లు ఏర్పాటు చేస్తున్నాం’ అని చెప్పారు. సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి, 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంటున్నామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ‘అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ప్రభుత్వ స్కూల్స్ బాగు చేయించాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశం లోనే రికార్డ్ సృష్టించాం. 2 ఏళ్ల లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల్ని గెలిపించే బాధ్యత తమదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, ఆ ఎన్నికల్లో గొప్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, తెలంగాణ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుందని రేవంత్ అన్నారు.
వర్గీకరణ మనమే ప్రథమం
దేశంలోనే మొదటగా తెలంగాణ ఎస్సీ వర్గీకరణ చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్రెడ్డి చెప్పారు. 100 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. మోదీ మెడలు వంచి దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేపట్టేలా చేశామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కలిపిస్తున్నామని చెప్పారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.