Minister Sitakka | మహిళా భద్రతకు పటిష్టచర్యలు.. అభద్రతను పోగొట్టేందుకు కృషి : రాష్ట్ర మంత్రి సీతక్క
మహిళల్లో ఉన్న అభద్రత భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా మా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

విధాత, వరంగల్ ప్రతినిధి:మహిళల్లో ఉన్న అభద్రత భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా మా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మహిళా భద్రతపై సచివాలయంలో బుధవారం మంత్రి సీతక్క సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్ష, శిక్షణ ఏకకాలంలో అమలయితేనే క్రైమ్ రేట్ తగ్గుతుందన్నారు. మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అమ్మాయిలను, మహిళలను గౌరవించేలా ప్రజల్లో అవగాహన పెంచుతామని చెప్పారు. మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయని స్పష్టం చేశారు. వాటి కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు.మత్తు బానిసలపై నిఘ పెంచుతామని తెలిపారు. ఆస్పత్రుల్లో పని చేసే డాక్టర్లు కూడా అభద్రతాభావం లో ఉండటం బాధాకరమని ఆమె అన్నారు. మహిళా డాక్టర్లకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తేల్చిచెప్పారు. మంత్రులు, ఉన్నతాధికారులతో త్వరలో కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్ సేఫ్టీ కమిటీలు వేస్తామని తెలియజేశారు. మహిళా భద్రత కోసం ప్రతి శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు. అమ్మాయిలు మహిళల భద్రత మీ బాధ్యత అని అన్ని విద్యాసంస్థలకు తెలియ చెబుతామని చెప్పారు. అమ్మాయిలను, మహిళలను గౌరవించేలా పాఠశాలల్లో పాఠాలు బోధిస్తామనీ, పబ్లిక్ ప్లేసుల్లో ఆసుపత్రిలో సీసీ కెమెరాలను పెంచేలా చర్యలు చేపడతామన్నారు. మహిళా భద్రత కోసం మా ప్రభుత్వం ప్రారంభించిన టి సేఫ్ యాప్ బాగా పనిచేస్తుందని అభినందించారు. టి సేఫ్ యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందన్నారు. ఈ యాప్ ను ప్రారంభించేందుకు ఏడు రాష్ట్రాలు ముందుకొచ్చాయన్నారు. టి సేఫ్ యాప్ కు మరింత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. ఆటోలు, క్యాబ్ ల్లో టి సేఫ్ నెంబర్లను ప్రచారం చేస్తమని వివరించారు.
మహిళా భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను త్వరలో సీఎంకు సమర్పిస్తామని మంత్రి వివరించారు. ఈ సమావేశానికి మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, మహిళా సహకార అభివృద్ది కార్పోరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి,మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమీషనర్ కాంతి వెస్లీ, ఉమేన్ సేఫ్టి డీజీ శిఖా గోయల్, ఐజీ రెమా రాజేశ్వరి, సీనియర్ మహిళా ఐఏఎస్ లు అనితా రామచంద్రన్, శైలజా రామయ్యార్, ఐ అండ్ పీఆర్ కమీషనర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.