Telangana High Court : కాళేశ్వరం కేసులో కేసీఆర్ కు బిగ్ రిలీఫ్

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావు, స్మిత సబర్వాల్‌కు హైకోర్టు నుంచి ఊరట. మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తూ కేసు విచారణ జనవరి 19కి వాయిదా.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Nov 12, 2025, 6:08 pm IST
Read Time: 2 mins
Telangana High Court : కాళేశ్వరం కేసులో కేసీఆర్ కు బిగ్ రిలీఫ్

విధాత, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో మరోసారి ఊరట దక్కింది. జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ స్మిత సబర్వాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారించిన హైకోర్టు అంతకు ముందుకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తున్నట్లుగా పేర్కొంది.

ప్రధాన న్యాయమూర్తి అపరేష్‌ కుమార్‌సింగ్‌, న్యాయమూర్తి జీఎం మోయిద్దీన్‌‌లతో కూడిన డివిజన్‌ ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కేసు విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేసేందుకు గాను 4 వారాల పాటు గడువు, పిటిషనర్లకు మరో మూడు వారాల పాటు సమయం ఇచ్చింది. అప్పటి వరకు కేసులో ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.