Revanth Reddy| రేవంత్ రెడ్డి దుష్పరిపాలనపై సబ్బండ వర్గాల ఆగ్రహం : కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా నేటికీ తెలంగాణకు పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం పట్ల కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం మానేసి కేవలం రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లపైనే దృష్టి సారిస్తున్నారని ధ్వజమెత్తారు.

Revanth Reddy| రేవంత్ రెడ్డి దుష్పరిపాలనపై సబ్బండ వర్గాల ఆగ్రహం : కేటీఆర్

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుష్పరిపాలనపై సబ్బండ వర్గాల ప్రజల్లో ఆగ్రహం నెలకొందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. రేవంత్ పర్యవేక్షణలోనే ఉన్న విద్యాశాఖ పనితీరు అధ్వాన్నంగా మారిందని, రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో కనీస వసతులు కరువయ్యాయని మండిపడ్డారు.

గడిచిన రెండేళ్ల కాలంలో సుమారు 112 ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్నాయని, వీటి వల్ల 2,422 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆయన తెలిపారు. మరీ ముఖ్యంగా, 123 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఇది ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. విద్యార్థుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని కేటీఆర్ విమర్శించారు. కనీస అవసరమైన నాణ్యమైన భోజనం కోసం పాఠశాల విద్యార్థులు సైతం నిరంతరం పోరాటాలు చేయాల్సి రావడం రాష్ట్ర పాలనలోని వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్న జనగామ జిల్లా గూడూరు గ్రామంలోని గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు తమకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తూ పాలకుర్తి – స్టేషన్ ఘన్‌పూర్ ప్రధాన రహదారిపై బైఠాయించిన ఘటన ప్రభుత్వ అసమర్థతను చాటిచెబుతోందని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా నేటికీ తెలంగాణకు పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం పట్ల కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం మానేసి కేవలం రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లపైనే దృష్టి సారిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి, పాలనను విస్మరించిన ముఖ్యమంత్రి తీరు వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడుతోందని ఆయన హెచ్చరించారు.