విధాత, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నిర్మించనున్న తెలంగాణ హైకోర్టు జోన్-2 భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. రెండోదశలో భాగంగా న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణానికి తాజాగా శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, సీఎం రేవంత్రెడ్డి, ఇతర న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే బుద్వేలులో అత్యాధునిక వసతులతో హైకోర్టు నూతన భవనం పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 100 ఎకరాల్లో హైకోర్టు నూతన బిల్డింగ్ను నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక న్యాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కొత్త హైకోర్టు భవన సముదాయానికి రూ.2,583 కోట్ల పరిపాలనా అనుమతి ఉంది. మొత్తం 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, ఎంఈపీ పనులకు రూ.1,980 కోట్లు, ఫర్నిచర్, ఆపరేటివ్ పరికరాలకు రూ.603 కోట్లు కేటాయించారు. 2024 డిసెంబర్ 7న జారీ చేసిన జీఓ ఆర్టీ నెం.827 ద్వారా పరిపాలనా ఆమోదం లభించింది. మూడేళ్లలో దీని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత న్యాయ వ్యవస్థకు మరింత విస్తృతమైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
