ఎన్నికల ప్రచారంలో విమర్శలు.. ప్రతి విమర్శలు.. పరస్పర ఆరోపణలు సహజం! అవికూడా మితిమీరనంత వరకూ కానీ.. తెలంగాణలో ప్రస్తుతం ఆ దశకూడా దాటిపోయినట్టు కనిపిస్తున్నది.

- మాట తూలుతున్న ముఖ్య నాయకులు
- ఘాటు విమర్శలు దాటి.. దూషణల పర్వం
- డీకేను సన్నాసి నా కొడుకా అన్న సీఎం కేసీఆర్
- కాంగ్రెసోళ్లు చెత్త నా కొడుకులన్న కేటీఆర్
- సిగ్గు లేకుండా ఓట్ల కోసం వస్తున్నారన్న హరీశ్
- కీలక నేతల ఆగ్రహావేశాలు దేనికి సంకేతం?
విధాత, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో విమర్శలు.. ప్రతి విమర్శలు.. పరస్పర ఆరోపణలు సహజం! అవికూడా మితిమీరనంత వరకూ కానీ.. తెలంగాణలో ప్రస్తుతం ఆ దశకూడా దాటిపోయినట్టు కనిపిస్తున్నది.
ఆవేశంతోనో, ఆక్రోశంతోనూ, ఆగ్రహంతోనూ లేదా ఆహంకారంతోనో.. ఏదైతేనేం? ముఖ్య నేతలు సైతం మాట తూలుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. కట్టు తప్పి మాట్లాడుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని సన్నాసి నా కొడుకు అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దూషించగా.. మంత్రి కేటీఆర్ 55 ఏళ్లు పాలించిన చెత్త నా కొడుకులు ఏం పీకారు? అంటూ నోరుపారేసుకున్నారు. ఇక మంత్రి హరీశ్రావు సైతం సిగ్గులేని కాంగ్రెస్ నాయకులను చీపుర్లతో తరమాలంటూ పిలుపునిచ్చారు. విధానాలపై చర్చ చేస్తూ.. తాము చేసింది చెప్పుకొని, అధికారంలోకి వస్తే ఇంకా ఏం చేస్తామో చెప్పుకోవడం రివాజు.
దాంతోపాటే గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రస్తావిడమూ జరిగేదే. ఆ క్రమంలో కొన్ని ఘాటు విమర్శలు కూడా ఉంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అధికార బీఆరెస్ నేతల ప్రచార తీరు కొద్ది రోజులు అలాగే నడిచింది. కానీ.. ఉన్నట్టుండి నేతలు బూతుపురాణాలు లంకించుకున్నారు. ఎదుటిపార్టీ నేతలను ఎంతగా తిడితే.. ప్రజల్లో అంతగా స్పందన వస్తుందనే భావన ఈ తిట్ల వెనుక ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పులను గమనించినా.. లేదా ప్రత్యర్థి పార్టీలు లేవనెత్తే అంశాలకు దీటైన సమాధానాలు చెప్పలేకపోయినా సహజంగానే రాజకీయ నాయకులు ఎంచుకునే మార్గం ఇదేనని వారు అంటున్నారు.
సీఎం మాటలు జనం ఆలకించడం లేదా?
రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆరెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో చెబుతున్న విషయాలను ప్రజలు ఆలకించడం లేదని, లేదా ప్రత్యర్థి పార్టీలను చులకన చేయాలన్న అహంకారం పెరగడంతోనే ముఖ్య నేతల్లో అసహనం హద్దులు దాటి ఉండొచ్చని పలువురు సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. తాము చెప్పింది ప్రజలకు ఎక్కడం లేదనే ఆక్రోశం కూడా అందుకు కారణం అయి ఉండొచ్చని చెబుతున్నారు. తమను ప్రశ్నించేంత స్థాయికి వెళతారా? అన్న అహంకారం కూడా ఇటువంటి మాటల వెనుక ఉంటుందని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.
అది అసహనమైనా, అహంకారమైనా .. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారికి తగనిదని ఆయన అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్లో జరిగిన బహిరంగంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సన్నాసి నా కొడుకా అని వాడకూడని మాట వాడారు. ఇదే తీరుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వలిగొండ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్లో షోలో స్థానికులు కొంత మంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎక్కడ? ఇంటికో ఉద్యోగం ఎక్కడ? కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడ? అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
దీంతో అగ్రహానికి గురైన కేటీఆర్ ‘ఆ సన్నాసులు అడుగుతున్నారు.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని! 55 ఏళ్లు పరిపాలించిన చెత్త నా కొడుకులు ఏం పీకారు? ఇజ్జత్, మానం లేదు అడగటానికి! 55 ఏళ్లు పరిపాలించిన చెత్త నా కొడుకులు ఇవాళ వచ్చి ఇది లేకపాయే.. అది లేకపాయే అంటే వీపు పగుల కొట్టే వాళ్లు లేకనా?’ అంటూ ఒంటికాలి మీద లేచారు. ‘మీ యాదాద్రిని జిల్లా చేసింది ఎవరు..? కేసీఆర్ గదా.. మరి చెత్త నా కొడుకులతో అయిందా 55 ఏళ్లలో! సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. 55 ఏళ్లలో కరెంట్ ఇచ్చిన కొడుకులా వీళ్లు.. తాగునీళ్లు ఇచ్చిర్రా. సాగు నీరు ఇచ్చిరా, రైతుబందు ఇచ్చిర్రా, కేసీఆర్ కిట్టిచ్చిర్రా, డిగ్రీ కాలేజ్ తెచ్చిర్రా. వలిగొండలో ఇవ్వి అడిగితే వీపు పగులకొట్టి పంపించాలే. 30వ తారీఖు నాడు ఎవడు అడ్డం వచ్చిన తొక్కుకుంటూ పోవుడే’ అంటూ శివాలెత్తారు. మంత్రి హరీశ్రావు గజ్వేల్ రోడ్ షోలో మాట్లాడుతూ సామాన్యుడు భరించలేనంగా రేట్లు పెంచి సిగ్గులేకుండా ఓట్ల కోసం వస్తున్న బీజేపోళ్లను అక్క, చెల్లెళ్లు చీపురు కట్టలు పట్టుకొని తరమాలని పిలుపునిచ్చారు. అప్పుడన్నా వాళ్లకు సిగ్గు వస్తుందన్నారు.
ప్రజావ్యతిరేకతను గుర్తించారా?
తెలంగాణ ఏర్పాటు తరువాత అధికార పార్టీకి మొదటి సారిగా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని మార్చాలన్న చర్చ కూడా ప్రజల్లో జరుగుతున్నది. 2018లో ఎక్కడా ఇలాంటి చర్చ స్థానిక ప్రజల్లో జరుగనేలేదు.
కానీ.. మొదటిసారిగా వ్యతిరేక సంకేతాలు కనిపించడంతో బీఆరెస్ నేతలు కట్టలు తెంచుకొని ఆగ్రహంతో ఊగిపోతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బరాజ్ ఈ ఎన్నికల సమయంలోనే కుంగటం ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. దీనిని ప్రధాన అస్త్రంగా తీసుకున్న విపక్షాలు కాళేశ్వరం అవినీతిపై గళమెత్తాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మేడిగడ్డకు వెళ్లి పరిశీలించారు. కేసీఆర్ అవినీతిపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ విమర్శల దాడి పెంచింది. కనుమరుగైందనుకున్న కాంగ్రెస్ ఊహించని రీతిలో పుంజుకోవడాన్ని బీఆరెస్ అగ్ర నేతలు జీర్ణించుకోలేక పోతున్నారన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నది.
పైగా రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందని భావించిన నేతలకు అది కాస్తా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ద్విముఖ పోటీగా మారడం కూడా మింగుడు పడటం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ప్రజల్లో తమ గ్రాఫ్ తగ్గిందని భావించిన తరువాతనే అధికార పార్టీ నేతలు బూతులు అందుకున్నారని అంటున్నారు. బీఆరెస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుల మాటలు పరిశీలిస్తే.. తమను ప్రజలు ఛీ కొడతారా అన్నఅహంకారం కనిపిస్తుందని, ఇదే సమయంలో పరిస్థితి చేయిదాటి పోతుందా? అన్న అసహనం కూడా వ్యక్తమవుతున్నదని రాజకీయ పరిశీలకుడొకరు అన్నారు.
