Telangana SIR: ఏప్రిల్​ నుండి తెలంగాణలో ‘సర్’ – ఆంధ్రప్రదేశ్​లో ‘డర్’​ : వణుకుతున్న పార్టీలు

తెలంగాణలో SIR ప్రక్రియ ఏప్రిల్​లో ప్రారంభం కానుంది. 50 లక్షల వరకు ఓట్లు తొలగించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్​లో ఏపీ వలస ఓటర్లు, తెలంగాణ గ్రామీణ ఓటర్లపై గణనీయ  ప్రభావం ఉండనున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా.

Telangana SIR: ఏప్రిల్​ నుండి తెలంగాణలో ‘సర్’ – ఆంధ్రప్రదేశ్​లో ‘డర్’​ : వణుకుతున్న పార్టీలు ఆంధ్రా పాలిటేనా ‘సర్’? హైదరాబాద్ వలస ఓటర్లపై ప్రభావం పడే అవకాశాలు

Telangana SIR Begins: Massive Voter Cleanup May Remove 50 Lakh Votes, Political Impact Likely

విధాత తెలంగాణ డెస్క్​ | హైదరాబాద్:
Telangana SIR | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే భారీ ప్రక్రియకు తెరలేచింది. ఓటర్ల జాబితాలను పూర్తిగా ‘శుద్ధి’ చేసే ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) కోసం భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం రాష్ట్రంలో బోగస్, నకిలీ ఓట్లపై కత్తి విసరనుంది. ఆశ్చర్యకరంగా దీని ప్రభావం పక్కనున్న ఆంధ్రాపై కూడా పడనుండటం గమనార్హం.

దేశవ్యాప్తంగా ఇప్పటికే అమలు చేసిన ఈ విధానాన్ని ఇప్పుడు తెలంగాణలో చేపట్టడం రాజకీయంగా, సామాజికంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండే పరిస్థితి, వలసల ప్రభావం, నగరాల్లో పెరిగిన నకిలీలు — అన్నీ ఇప్పుడు తీవ్ర పరిశీలనాపరిధిలోకి వచ్చాయి.

SIR ఎలా పనిచేస్తుంది..? ఎవరి ఓటు మిగులుతుంది..?

ఇది సాధారణ సవరణ కాదు. ఓటరు నిజంగా అక్కడే నివసిస్తున్నాడా? అర్హుడా? కాదా అన్నది పూర్తిగా తనిఖీ చేసే ప్రక్రియ.

ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేస్తారు. ఆ సమయంలో:

  • కనీసం 6 నెలలుగా అక్కడే నివసిస్తున్నారా?
  • ఆధార్, నివాస ధృవీకరణ ఉందా?
  • ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయా?

అన్న అంశాలను పరిశీలిస్తారు.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా పేరు, వయసు, తండ్రి పేరు, చిరునామా ఆధారంగా నకిలీ ఓట్లను గుర్తిస్తారు. ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు ఉంటే — ఒక్క కోరుకున్నదాన్ని తప్ప మిగిలినవన్నీ రద్దు చేయాల్సిందే.

50 లక్షల ఓట్లు ఔట్​..? హైదరాబాద్ ​పైనే దృష్టి

తెలంగాణ SIR ప్రక్రియలో ఓటరు జాబితా ధృవీకరణ, డూప్లికేట్ ఓట్ల గుర్తింపు

తెలంగాణలో ‘సర్’ ప్రక్రియ మొదలు.. ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్లపై ఈసీ ఫోకస్

ఈ ప్రక్షాళనలో తెలంగాణలో సుమారు 50 లక్షల వరకు ఓట్లు తొలగించే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం 3.35 కోట్ల ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ఈ సంఖ్య 2.75 నుండి 2.80 కోట్లకు పడిపోయే అవకాశం ఉంది.

ప్రత్యేకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఈ ప్రక్రియలో హాట్‌స్పాట్‌లుగా మారనున్నాయి.

  • ఈ మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 87 లక్షల ఓట్లు ఉన్నాయి.
  • అందులో దాదాపు 20 లక్షల వరకు డూప్లికేట్ ఓట్లు ఉండొచ్చని అంచనా

ఇక గ్రామీణ తెలంగాణలో కూడా పట్టణాలకు వలసల కారణంగా మరో 30 లక్షల వరకు ఓట్లు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

 ఆంధ్రా నుంచి వచ్చినవారిపై ప్రభావం?

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్‌కు వలస వచ్చి స్థిరపడ్డారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య — ఇలా పలు కారణాల వల్ల నగరం ప్రధాన కేంద్రంగా మారింది.

ఈ క్రమంలో చాలామంది తమ స్వగ్రామాల్లో (ఏపీ) ఓటు కొనసాగించడంతో పాటు, హైదరాబాద్‌లో కూడా కొత్తగా నమోదు చేసుకున్నారు.

  • వ్యాపార రీత్యా ఇక్కడే స్థిరపడినవారు
  • ఉద్యోగాల కోసం 5–10 ఏళ్లుగా నివసిస్తున్నవారు
  • పిల్లల ఉన్నతవిద్య కోసం కుటుంబాలతో కలిసి నగరానికి వచ్చినవారు

ఈ వర్గాల్లో చాలామందికి తెలిసినా, తెలియకపోయినా, చట్టపరంగా ఒక వ్యక్తికి ఒకే చోట మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. తెలిసినా, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఇంకో ఓటు రద్దుచేసుకోకపోవడం కొసమెరుపు.

SIR ప్రక్రియలో:
👉 ఎక్కడ 6 నెలలుగా నివసిస్తున్నారో అక్కడే ఓటు కొనసాగుతుంది
👉 మరో చోటున్న ఓటు తొలగించబడుతుంది

రాజకీయంగా ఎవరికీ లాభం..? ఎవరికీ నష్టం..?

ఈ ప్రక్రియ రాజకీయంగా కూడా హాట్ టాపిక్‌గా మారుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసిస్తూ, ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి ఓటు వేసే వర్గంపై దీని ప్రభావం విశేషంగా ఉంటుందని విశ్లేషణలు చెబుతున్నాయి.

రాజకీయ వర్గాల అంచనా ప్రకారం, ఈ వలస ఓటర్లలో గణనీయమైన శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారనే అభిప్రాయం ఉంది. గతంలో ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీ జిల్లాలకు పెద్ద ఎత్తున ప్రయాణాలు జరగడం, చంద్రబాబుకు హైదరాబాద్​లో గణనీయమైన  సంఖ్యలో ‘అభిమాను’లుండటం ఈ అభిప్రాయానికి బలం చేకూర్చిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రెండు చోట్ల ఓటు అవకాశం లేకుండా పోతే, ఆ వర్గం ఓటింగ్ ప్రభావం తగ్గవచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా స్థానిక రాజకీయ సమీకరణలపై ఆధారపడుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు.

4 దశల్లో పూర్తయ్యే ప్రక్రియ

SIR మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది:

  1. ఇంటింటి సర్వే
  2. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
  3. అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరణ
  4. తుది ఓటర్ల జాబితా విడుదల

మొత్తంగా చూస్తే SIR ప్రక్రియ తెలంగాణలో ఓటర్ల వ్యవస్థను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. అసలైన అర్హులే మిగిలేలా చేయాలన్న లక్ష్యం ఎంతవరకు నిష్పక్షపాతంగా అమలు అవుతుందన్నది కీలకం.

అయితే, ఈ తతంగం రాజకీయ సమీకరణలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో—రాబోయే రోజుల్లో ఇది మరింత హాట్ టాపిక్‌గా మారడం ఖాయం.