Hussain Sagar | హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్( Hussain Sagar ).. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ప్రతిరోజు వేలాది మంది ట్యాంక్బండ్( Tank Bund )ను సందర్శిస్తూ.. సాగర తీరాన కాసేపు సేదతీరి ఓ ఐస్క్రీమ్ లాగించేసి ఓ ప్రత్యేక అనుభూతి పొందుతారు. కానీ గత కొద్ది రోజుల నుంచి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే హుస్సేన్ సాగర్లోని నీరంతా పసుపు రంగు( Yelloe Colour )లోకి మారి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పర్యాటకులు( Tourists ), స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. సాగర్లోని నీటి నాణ్యత పూర్తిగా క్షీణించిపోవడంతో.. ముక్కుపుటాలు అదిరేలా కంపు కొడుతోంది. ఈ క్రమంలో అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేని పరిస్థితి దాపురించింది.
అయితే ఈ దుర్వాసన తెలంగాణ సచివాలయం నుంచి లుంబినీ పార్కు మధ్య వెదజల్లుతోంది. ఈ ప్రాంతంలోనే నీరు కూడా పసుపు రంగులోకి మారింది. దీనిపై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ( BPPA ) అధికారులు కూడా స్పందించారు. గత రెండు వారాలుగా నీటి రంగు పసుపు రంగులోకి మారిందని అధికారులు ధృవీకరించారు.
వాతావరణ మార్పుల వల్లే
వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల నీటి రంగు మారిందని బీపీపీఏ అధికారి వెల్లడించారు. శీతాకాలం ముగిసి.. వేసవి కాలం ప్రారంభమయ్యే ముందు క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా హుస్సేన్ సాగర్ నీరు పసుపు రంగులోకి మారింది. అప్పుడప్పుడు ఆకుపచ్చగా, నలుపు రంగులోకి కూడా మారుతుంది. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, ట్యాంక్ బండ్, బుద్ధ భవన్ వరకు దుర్వాసన వెదజల్లుతున్న మాట వాస్తవమేనని అధికారి పేర్కొన్నారు.
నీటి నాణ్యతను పెంపొందిస్తున్నాం..
ఈ నీటి రంగు మార్పునకు ఉష్ణోగ్రతలతో పాటు శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు, రసాయన వ్యర్థాలను నేరుగా హుస్సేన్ సాగర్లోకి మళ్లించడమే ప్రధాన కారణమని సదరు అధికారి తెలిపారు. అయితే నీటి నాణ్యతను పెంపొందించేందుకు బీపీపీఏ బయోరెమిడియేషన్ విధానాన్ని అవలంభిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా కాలుష్య కారకాలను, దుర్వాసనను తగ్గించే మైక్రో ఆర్గానిజమ్స్ను ఉపయోగిస్తున్నామని చెప్పారు. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, ఈస్ట్లు, ఫొటోసింథటిక్ బ్యాక్టీరియా వంటి మైక్రో ఆర్గానిజమ్స్ను ఉపయోగించడం వల్ల నీటి రంగును పలుచగా చేయడంతో పాటు దుర్వాసనను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.. వేసవి కాలం వరకు కొనసాగుతుందన్నారు. మొత్తానికి హుస్సేన్ సాగర్ నీటి నాణ్యతను పెంపొందించి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకుంటున్నామని బీపీపీఏ అధికారి స్పష్టం చేశారు.
