Uttam Kumar Reddy | అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు.. ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం

రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరీ ఉంటుందని మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది.అయితే అందుకు విధి విధానాలను పరిశీలిస్తున్నట్లు మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు నిర్ణయించారు.

Uttam Kumar Reddy | అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు.. ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం

గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు
పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు
పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయం ఆధారంగా మంజూరు
విధి,విధినాల రూపకల్పనలో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
లోకసభ, రాజ్యసభ, శాసనసభ,శాసనమండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి
వారందరికీ సమాచారం చేరేలా లేఖలు రాయండి
సక్సేనా కమిటీ సిఫారసుల పరిశీలన
దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో తెల్లరేషన్ కార్డుల అర్హత ప్రమాణాలు పరిశీలన
అంతర్ రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డు ఉండి ఇక్కడా ఉంటే ఏరివేత
కొత్త రేషన్ కార్డుల మంజూరీ పై సచివాలయంలో సమావేశం అయిన మంత్రివర్గ ఉపసంఘం
ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం
హాజరైన ఉప సంఘం సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదరరాజనరసింహ లు

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరీ ఉంటుందని మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది.అయితే అందుకు విధి విధానాలను పరిశీలిస్తున్నట్లు మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు నిర్ణయించారు. శనివారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం సీఎం రేవంత్ రెడ్డి వేసిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై తెల్ల రేషన్ కార్డు మంజూరీపై నిశితంగా చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదరరాజ నరసింహా, రెవిన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డి.యస్ చౌహన్, ఆరోగ్య శాఖా కార్యదర్శి చిరిస్తినాజ్ చొంగతిలు పాల్గొన్నారు. తెల్ల రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నరకు లోపు ఆదాయం, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు అదే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాదన ఉపసంఘం ముందుకు వచ్చిందన్నారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకాశం కోల్పోకోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నామన్నారు.అందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికార,ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుండి కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో వారి సలహాలు,సూచనలు తీసుకోనున్నట్లు ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తక్షణమే రాజ్యసభ, లోకసభ,శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధి విధినాలలో వారి నుండి సూచనలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డి.యస్ చౌహన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

కొత్త కార్డుల మంజూరీలో సక్సెనా కమిటీ సిఫారసుల పరిశీలన

కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో డాక్టర్ ఎన్.సీ.సక్సెనా కమిషనర్ గా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోబోతున్నట్లు మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ సభ్యుడిగా ఉన్నారని, అంతే గాకుండా రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు దిగువ పేద మధ్యతరగతి ప్రజలకు మంజూరు చేసునున్న తెల్ల రేషన్ కార్డుల మంజూరీ విషయంలో అధికారుల బృందం ఇప్పటికే దేశంలోని మిగతా రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో అవలంబిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే అదే సమయంలో అంతర్ రాష్ట్రాల నుండి తెలంగాణాకు వలస వచ్చిన వారికి అక్కడ ఇక్కడ రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లు తేలిందని అటువంటి వారికి అక్కడో… ఇక్కడో అన్న అప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉప సంఘం చర్చించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందే తడవుగా కొత్త తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో పది లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు.