: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతిపై మిస్టరీ వీడింది. భర్త బోడా ప్రవీణ్ కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్టు పోలీసులు తేల్చారు.
విధాత, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతిపై మిస్టరీ వీడింది. భర్త బోడా ప్రవీణ్ కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్టు పోలీసులు తేల్చారు. 45 రోజుల తర్వాత శవపరీక్ష నివేదికలో ఈ విషయం నిర్ధరించారు. విషం కలిపిన ఇంజక్షన్ ఇచ్చి భార్యను హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఖమ్మం ఏసీపీ రమణమూర్తి ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం మీడియాకు వెల్లడించారు. మే 28న బాబోజితండాకు చెందిన డా. బోడా ప్రవీణ్, తన భార్య కుమారి(25), కుమార్తెలు కృషిక (4), తనిష్క(3)తో కలిసి కారులో మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరారు. గ్రామం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి కారు రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొన్నట్లుగా అప్పట్లో భావించారు. ప్రమాదం సమయంలో రహదారిపై వెళ్తున్నవారు కారులోని వారిని బయటకు తీశారు. అప్పటికే కృషిక, తనిష్క మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారిని 108 అంబులెన్సు సిబ్బంది ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కుమారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రవీణ్ కు స్వల్ప గాయాలవ్వడంతో అతన్ని బందువులు ఆటోలో మరో ఆసుపత్రికి తరలించారు. భర్త ప్రవీణే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. కుమారి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ముగ్గురి మృతదేహాలపై గాయాలు కనిపించకపోవడంతో వారు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆధారాలతో దొరికిన నిందితుడు
ఘటన జరిగిన రోజు పోలీసులు కారును తనిఖీ చేయగా.. ఖాళీ సిరంజ్ దొరికింది. దాన్ని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపించగా.. విషం కలిపిన ఇంజక్షన్ ఇచ్చినట్టు తేలింది. ప్రవీణ్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా.. అందులో కూడా కీలక ఆధారం లభ్యమైంది. అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్ ఇస్తే ఎన్నిగంటల్లో చనిపోతారనే విషయాలను ప్రవీణ్ గూగుల్ సెర్చ్ చేసినట్టు గుర్తించారు. ‘పోస్టు మార్టం నివేదిక, ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా నిందితుడిపై హత్యకేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఏసీపీ తెలిపారు. నిందితుడు బొడ ప్రవీణ్ ఫిజియోథెరపిస్టుగా హైదరాబాద్లో ప్రభుత్వ డాక్టర్గా పని చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఆ సమయంలో కేరళకు చెందిన సోనీ ఫ్రాన్సిస్ అనే మరో నర్స్తో ప్రవీణ్కు అక్రమ సంబంధం ఏర్పడిందని ఎసీపీ పేర్కొన్నారు. వారి అక్రమ సంబంధంపై ఇంట్లో గొడవలు జరగడంతో సోనీ, ప్రవీణ్ పక్కా ప్రణాళికతో భార్య పిల్లల అడ్డు తొలగిస్తే ప్రశాంతంగా వుండొచ్చన్న ఉద్ధేశంతోని మే 28 తేదీ హైదరాబాద్ నుండి ఇంటికి బయలుదేరి సాయంత్రం సమయంలో తనతో తెచ్చుకున్న డ్రగ్ కాల్షియం ఇంజెక్షన్లో కలిపి ఇచ్చి భార్యను చంపేసి, ఇద్దరు పిల్లలను నోరు మూసి ఊపిరి అడకుండా చేసి చంపడం జరిగిందని నిందితుడు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడు ప్రవీణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు విచారణ చేసిన పోలీసులు అధికారులు సీఐ శ్రీహరి, ఎస్సై సురేష్ ను పోలీస్ కమిషనర్ అభినందించినట్లు ఎసీపీ పేర్కొన్నారు.