కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్దమైన వాటా దక్కే వరకు ప్రభుత్వం రాజీపడేది లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. జలసౌధలో ఆదివారం సుప్రీం కోర్టు, ట్రైబ్యునల్ పెండింగ్ ఉన్న అంతర్ రాష్ట్ర జల వనరుల సమస్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు
సాగర్, శ్రీశైలంను బోర్డుకు అప్పగించం
అంతరాష్ట్ర జలవనరుల వివాదాల సమీక్షలో మంత్రి ఉత్తమ్
విధాత, హైదరాబాద్ :: కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్దమైన వాటా దక్కే వరకు ప్రభుత్వం రాజీపడేది లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. జలసౌధలో ఆదివారం సుప్రీం కోర్టు, ట్రైబ్యునల్ పెండింగ్ ఉన్న అంతర్ రాష్ట్ర జల వనరుల సమస్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, లాయర్ల బృందంతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా సాధనకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టులో, ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని, ట్రైబ్యునల్ తీర్పు వచ్చేవరకు సగం వాటా కోసం ప్రయత్నించాలని అధికారులకు వెల్లడించారు. శ్రీశైలం, సాగర్ జలాశయాలను కృష్ణా బోర్డుకు అప్పగించేదిలేదని పునరుద్ఘాటించారు. కృష్ణా జలాల్లో వాటా, ప్రజల ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహారాష్ట్ర, కర్ణాటకతో చర్చలు జరిపితే పలు అంతరాష్ట్ర జల వివాదాలకు పరిష్కారం లభిస్తుందని వైద్యనాథన్ బృందం సూచించింది. ఇందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమతి ఇచ్చారు. సమావేశంలో తెలంగాణ నీటిపారుదల సలహాదారు, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాధ్ దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శులు రాహుల్ బొజ్జా, ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.