Road accident : మెదక్‌ జిల్లాలోని చేగుంటలో ఇవాళ (శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వడియారం వద్ద బైపాస్‌ రోడ్డుపై రెండు లారీలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. బైపాస్‌ రోడ్డులో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక లారీ డ్రైవర్‌తోపాటు క్యాబిన్‌లో కూర్చున్న ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.