పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నేతలు పరస్పరం చేసుకుంటున్న విమర్శల పర్వంలో దేవుళ్లకు సైతం తిట్లు తప్పడం లేదు.
విధాత, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నేతలు పరస్పరం చేసుకుంటున్న విమర్శల పర్వంలో దేవుళ్లకు సైతం తిట్లు తప్పడం లేదు. బీజేపీ నేతలు రాముడిని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్న క్రమంలో, కాంగ్రెస్, బీఆరెస్ నేతలు రాముడు బీజేపీ సొంతమా అంటూ దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ ప్రచార సభలో అయోధ్య శ్రీరాముడి అక్షింతలు అంటూ రేషన్ బియ్యం అక్షితలను పంచారంటూ విహెచ్పి, బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ నేతలు సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హిందుత్వంపై, హిందూ విశ్వాసాలపై, హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు, సీతలపై విమర్శలు గుప్పించడాన్ని తప్పుబట్టిన వీహెచ్పీ అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలను రేవంత్రెడ్డి అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ, ముస్లిం, క్రైస్తవుల మెప్పు కోసం ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేసింది.