Warangal Flood Problem | వరంగల్ వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక.. అండర్గ్రౌండ్ డ్రైనేజీకి ప్రాధాన్యం
వరంగల్లో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. నాలాల మార్కింగ్, విభాగాల మధ్య సమన్వయంపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వరద నివారణ చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
- నాలాల మార్కింగుకు ప్రత్యేక సూచన
- నివారణోపాయాలకు కలెక్టర్ ఆదేశం
- శాఖల మధ్య సమన్వయం పైన శ్రద్ధ
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Warangal Flood Problem | ఏటా వరద ముంపునకు గురై తీవ్ర అవస్థలపాలైతున్న వరంగల్ నగర సమస్యపై ముందస్తుగా చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్గా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్న చాహత్ బాజ్పాయ్ వర్షాకాలానికి ముందుగానే వరద ముంపు నివారణకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు అవసరమైన పక్కా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
- ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ , ఇరిగేషన్ , రెవిన్యూ , సర్వే విభాగాల అధికారులతో మంగళవారం ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
- ముందుగా నగరంలోని నాలాల స్థితిగతులను గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు.
- ప్రణాళిక రూపొందించేందుకు అవసరమైన సూచనలను చేశారు.
- గూగుల్, డ్రోన్ సర్వే ద్వారా సేకరించిన నగర మ్యాపింగ్ సంబంధిత సమాచారంపై చర్చించారు.
- నగరంలో ప్రధాన నాలాలు ప్రారంభమయ్యి, ముగిసే వరకు గల ప్రాంతాలను ఆయా ప్రాంతాల్లో వాటి వెడల్పులు ఇందుకు అవరోధంగా ఉన్న నిర్మాణాలు, బ్రిడ్జిలు, కల్వర్టులను పరిశీలించారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం నేపథ్యంలో స్ట్రామ్ వాటర్ డ్రైన్ల ఏర్పాటుకు ఇరిగేషన్, సర్వే విభాగాలు సంయుక్తంగా సమగ్ర సర్వే చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం సంబంధిత కన్సల్టెన్సీ వారితో సమావేశం నిర్వహించి డాటా సేకరించనున్నట్లు పేర్కొన్నారు. నగర పరిధి లో గల 130- నుంచి 140 వాటర్ బాడీస్, వాటికి అనుసంధానమై ఉన్న నాలాల సమాచారాన్ని ఇరిగేషన్ విభాగం అధికారులు అందజేయాలని సూచించారు.
నగరంలోని ప్రధాన నాలాలు వాటికి కనెక్ట్ అయి ఉండే నాలాల పై సర్వే నిర్వహించి సమాచారం అందించాలని, ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ దశలో ఉన్నందున ఎన్ ఐ టి వారి సహకారాన్ని తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బల్దియా పరిధి లోని 66 డివిజన్ ల పరిధిలో పక్క గా నాలా మార్కింగ్ చేయాలని చెప్పారు. నాలా లు గతంలో ఏవిధంగా ఉండేవని ప్రస్తుతం వాటి స్థితి గతులను తెలుసుకున్నారు.
ఒక్కో నాలా ఎంత వెడల్పు ఉండాలి వంటి అంశాల పై సమగ్రం గా అధ్యయనం చేయాలన్నారు. నాలా విస్తరణ లో ఏమైనా నిర్మాణాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్న వాటిని గుర్తించి అంచనాలు తయారు చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో బల్దియా ఇంచార్జి ఎస్ ఈ శ్రీనివాస్ రావు, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏడి సర్వే శ్రీనివాసులు, ఈఈలు రవి కుమార్, సంతోష్ బాబు, ఇరిగేషన్ డిఈ హర్షవర్థన్, సుచరణ్, బల్దియా డి ఈ లు మొజామిల్. రోజా రాణి తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram