మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి వరద నీటిని దిగువకు వదలాలని ఎన్డీఎస్ఏ సూచించిందని, నిపుణల బృందం ఎన్డీఎస్ఏ సూచన మేరకు మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తెరిచి నీటిని వదలివేస్తున్నామని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
వారికంటే బీఆరెస్ వాళ్లు నిపుణులా
ప్రజల జీవితాలతో చెలగాటమా
ఎన్డీఎస్ఏ సమావేశం వివరాల వెల్లడి
విధాత, హైదరాబాద్ : మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి వరద నీటిని దిగువకు వదలాలని ఎన్డీఎస్ఏ సూచించిందని, నిపుణల బృందం ఎన్డీఎస్ఏ సూచన మేరకు మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తెరిచి నీటిని వదలివేస్తున్నామని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఎస్ఏ సమావేశం అనంతరం ఆయన వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రజల జీవితాలతో ముడిపడిన అంశంలో తాము నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. బీఆరెస్ నాయకులు మేడిగడ్డ వద్ద గోదావరి నీటి నిల్వపై చెబుతున్న సలహాలను మేం పాటించబోమన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి కేసీఆర్ స్వయంగా ఇంజనీర్ అవతారమెత్తి రీడిజైన్ చేసిన నిర్మింపచేసిన మేడిగడ్డ బ్యారేజీ ఆయన హయాంలోనే కూలిపోయిందన్న సంగతి మరువరరాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే కేసీఆర్ సీఎంగా నోరు మెదపలేదని, పైగా బాంబులు పెట్టారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారన్నారు. కేసీఆర్ కక్కుర్తి, దోపిడికి కాళేశ్వరం నిదర్శనంగా నిలిచిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలను, పిల్లలను సైతం తాకట్టు పెట్టి అధిక వడ్డీలతో కూడిన రుణాలు తెచ్చి విలువైన ప్రజాధనం వృధా చేశారన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెడితే కొత్తగా లక్ష ఎకరాలకు కూడా నీళ్లందించలేదన్నారు. 84వేల కోట్ల అంచనాతో మొదలు పెట్టి 1లక్ష 24వేల కోట్లకు పెంచారని, పూర్తయ్యే నాటికి లక్షన్నర కోట్లు దాటిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇంత ఖర్చు చేసినా ఏడాదికి 13టీఎంసీల పంపింగ్కు మాత్రమే అవకాశముండగా, తద్వార ఏటా 1లక్ష 30వేల ఎకరాలకే నీరందే అవకాశముందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి తెచ్చిన అప్పులపై వడ్డీనే ఏటా 15వేల కోట్లు అవుతుండగా, పూర్తి స్థాయిలో అన్నిపంప్లు నడిస్తే కరెంటు బిల్లు 10వేల కోట్లు చెల్లించాల్సివస్తుందన్నారు.
సోమవారం సమావేశంలో భవిష్యత్తు నిర్ణయాలు
కాళేశ్వరం ప్రాజెక్టు పై అమూల్యమైన ప్రజాధనం ఖర్చు చేయబడిందన్న ఆలోచనతో ఎలాగైన ఈ ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని ఎన్డీఎస్ఏ సూచనలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఎన్డీఎస్ఏ సూచించిన రక్షణ పనులు ఫౌండేషన్ ఫిల్లింగ్, పియర్స్ క్రాక్స్ ఫిల్లింగ్ వంటి పనులు చేపట్టామన్నారు. ఈ రోజు ఎన్డీఎస్ఏ సమావేశంలో వారు సూచించిన మేరకు ఏమేం పనులు చేశాం..ఇంకా ఏం చేయాలన్నదానిపై చర్చించామన్నారు. కొన్ని జాతీయ సంస్థలకు ఇచ్చిన పరీక్షల రిపోర్టులు రాలేదని ఉత్తమ్ వెల్లడించారు. బ్యారేజీని ఎంతవరకు రిపేర్ చేయవచ్చన్నదానిపై, ఎంతవరకు నీళ్లను నిల్వ చేయవచ్చన్నదానిపై చర్చించామని, ఇప్పటికైతే అన్ని బ్యారేజీలను గేట్లు ఎత్తివేసి నీళ్లను కిందకు వదిలేయమని చెప్పారన్నారు. ఎన్డీఎస్ఏ సలహా మేరకు కేబినెట్లో చర్చించి ముందుకెలుతామన్నారు. సోమవారం మరోసారి ఇంజనీర్ల స్థాయిలో చర్చలు జరుగుతాయని, ఈ సమావేశంలో భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులను పాత కాంట్రాక్టు సంస్థలతోనే చేయిస్తున్నామని, మేం ఏం ఖర్చు చేయలేదన్నారు. మేడిగడ్డలో కుంగిన గేటను కట్ చేసి తొలగించామని, అన్నారం, సుందిళ్లలోనూ సీపేజ్లు ఉన్నాయన్నారు. తప్పనిసరిగా నిర్మించబడిన అన్ని ప్రాజెక్టులను వినియోగించుకోవాలన్న దృక్పథంతోనే ప్రభుత్వం ఉందని, ఎల్లంపల్లి నుంచి మొదలుకుని అన్ని ప్రాజెక్టులు వినియోగిస్తామన్నారు. కడెం ప్రాజెక్టు గేట్ల రీపేర్లు చివరి దశలో ఉన్నాయన్నారు. బీఆరెస్ నేతల ఉచిత సలహాలు అవసరం లేదని, నిపుణుల సూచనల మేరకే ముందుకెలుతామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా స్థానికంగా ఉండాలని ఆదేశించామన్నారు.