Site icon vidhaatha

Weather Update | మరో రెండురోజులు వడగాలులు.. ఆ తర్వాతే వర్షాలు..!

Weather Update | తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు చేరాయి. శనివారం అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లీపూర్‌, జైనా గ్రామాల్లో 46.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఆది, సోమవారాల్లోనూ ఎండలు దంచికొడుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆదివారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ తీవ్రమైన వడగాలులు వీస్తాయని పేర్కొంది.

సోమవారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వస్తాయని తెలిపింది. అలాగే, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నిజామాబాద్‌, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నాగర్‌ కర్నూల్‌ తదితర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని వివరించింది. ఈ నెల 7, 8 తేదీల్లోనే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ప్రకటించింది.

Exit mobile version